హైదరాబాద్ : మద్యం డోర్ డెలివరీ కోసం ప్రయత్నిస్తున్న వ్యక్తిని బురిడీ కొట్టించి డబ్బులు కాజేసిన వ్యక్తిపై నగరంలోని బంజారాహిల్స్ పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉత్తర్ ప్రదేశ్లోని గ్రేటర్ నోయిడాకు చెందిన మేనేజ్మెంట్ సంస్థలో పనిచేస్తున్న అనురాగ్ ప్రశాంత్ ఈ నెల 14న పనిమీద నగరానికి వచ్చి బంజారాహిల్స్ రోడ్ నెం 1లోని తాజ్ బంజారా హోటల్లో దిగాడు. లాక్డౌన్ అమల్లో ఉందని భావించిన అనురాగ్ ప్రశాంత్ ఈ నెల 20న తనకు కావాల్సిన మద్యం బాటిళ్లను ఎవరైనా సమకూరుస్తారా అని తెలుసుకునేందుకు గూగుల్లో వెతికాడు.
దాంతో గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేశాడు. తాము మద్యం సరఫరా చేస్తామని, దీనికోసం ముందుగానే క్రెడిట్ కార్డు ద్వారా పేమెంట్ చెయాలని కోరాడు. దానికి అంగీకరించిన అనురాగ్ ప్రశాంత్ తన క్రెడిట్ కార్డు వివరాలను చెప్పాడు. కాసేపటికి ఓటీపీ నెంబర్ రాగా దాన్ని చెప్పడంతో అతడి అకౌంట్నుంచి రూ.59,900 డెబిట్ అయినట్లు మెసేజ్ వచ్చింది. మరికొంత సేపటికి మరో రూ.10వేలు డ్రా అయ్యాయని మెసేజ్ వచ్చింది.
అప్పటినుంచి మద్యం సరఫరా చేయకపోగా ఫోన్లు ఎత్తకపోవడంతో తాను మోసపోయినట్లు గుర్తించిన బాధితుడు అనురాగ్ ప్రశాంత్ బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఇవి కూడా చదవండి..
త్వరలో సోమశిల- సిద్ధేశ్వరం బ్రిడ్జి నిర్మాణం
న్యాయవాది వృత్తిలో ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం
అసంపూర్తి పనులు సత్వరమే పూర్తి చేయాలి
మెరుగైన వైద్యమే ప్రభుత్వ లక్ష్యం : ఎమ్మెల్యే గండ్ర