రంగారెడ్డి : జిల్లాలో లాకోర్స్ చదివిన బీసీ విద్యార్థుల నుంచి న్యాయవాద వృత్తిలో మూడు సంవత్సరాల ఉచిత శిక్షణ పొందుటకు 2021-22 సంవత్సరానికి గాను దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ అమయ్కుమార్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నుంచి గుర్తింపు పొందిన కళాశాల నుంచి లాకోర్స్ పాసై ఉండాలన్నారు. వయోపరిమితి జూలై 2021 నాటికి 23 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల లోపు ఉండాలని చెప్పారు.
తండ్రి/సంరక్షకుని వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో రూ. 1.50 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో 2లక్షలకు మించరాదన్నారు. అభ్యర్థులు గాని, వారి కుటుంబంలో వారెవరైనా గాని గతంలో ఈ ఉచిత శిక్షణ పొంది ఉండరాదని, డిక్లరేషన్ జతచేయాలని సూచించారు. బార్ కౌన్సిల్ పేరు నమోదు చేసుకుని ఉండాలన్నారు.
అర్హులైన బీసీ యువతీ యువకులు వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి కార్యాలయం రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం లక్డీకపూల్ 3వ అంతస్తు, స్నేహ సిల్వర్ బిల్డింగ్లో జూలై 15వ తేదీ సాయంత్రం 5గంటల వరకు దరఖాస్తులు అందజేయాలన్నారు. పాస్ ఫొటో సైజు ఫొటోలు, కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు, విద్యార్హత సర్టిఫికెట్స్ దరఖాస్తుకు జతచేయాలన్నారు. ఆసక్తిగల యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.