నిజామాబాద్, జూలై 30 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): గంగాధర్ దంపతులు ప్రైవేటు ఉద్యోగులు. ఇరువురు పని చేస్తేనే కుటుంబ పోషణ నడుస్తుంది. ఉదయమే లేచి పిల్లలను స్కూళ్లకు సిద్ధం చేశారు. వర్షంలోనే రెయిన్ కోట్ ధరించి… పిల్లలను పాఠశాల వద్ద దిగబెట్టారు. తమ విధులకు హాజరయ్యారు. అకస్మాత్తుగా పాఠశాలలకు సెలవు అంటూ విద్యాశాఖ నుంచి ప్రకటన. అప్పటికప్పుడు ఏమి చేయాలో అర్థం కాక గంగాధర్ లాంటి వ్యక్తులు అనేక మంది గురువారం తీవ్రంగా విలవిల్లాడాల్సిన దుస్థితి ఏర్పడింది. కొన్ని ప్రైవేటు సంస్థలో విధులకు హాజరైన తర్వాత బయటకు వచ్చేందుకు అనుమతి లేదు. కనీసం మొబైల్ ఫోన్లు వాడేందుకు పర్మిషన్ ఉండదు.
అలాంటి చోట్ల ఉద్యోగాలు చేసే వారికి జిల్లా యంత్రాంగం నిర్ణయంతో ఇక్కట్లు ఎదుర్కోవాల్సి వచ్చింది. చేసేది లేక తెలిసిన వ్యక్తులకు సమాచారం ఇచ్చి పిల్లలను బంధువుల ఇంట్లో దించేలా ఏర్పాట్లు చేసుకున్నారు. ఇదొక్క గంగాధర్కు ఎదురైన ఘటనే కాదు. ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగస్తులు అనేకులు ఇదే రకమైన సమస్యను ఎదుర్కొన్నారు. విద్యాశాఖ నిర్లక్ష్యం, జిల్లా యంత్రాంగం నిర్లీప్తత మూలంగా సామాన్య కుటుంబాలు ఆగమాగం కావాల్సి వచ్చింది. ఏకధాటి వానలతో సతమతం అవుతోన్న తల్లిదండ్రులెందరో సెలవు లేదని భావించి వ్యయప్రాయాసలకోర్చి పిల్లలను స్కూళ్లకు పంపిన నిమిషాల్లో గందరగోళం వెలుగు చూడటం విడ్డూరంగా మారింది.
నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఒక రోజు ముందుగానే హైదరాబాద్లోని వాతావరణ కేంద్రంతో పాటుగా ప్రైవేటు సంస్థలు అనేకం హెచ్చరికలు జారీ చేశాయి. దీంతో పాటుగా తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలోని కామాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి భారీ వర్షాలపై మెసేజ్లు సైతం వచ్చాయి. ఇవేవి జిల్లా యంత్రాంగానికి పట్టలేదు. ఉన్న ఫళంగా గురువారం ఉదయం 8.28నిమిషాలు మెసేజ్ జారీ చేశారు. ఆ సందేశం స్కూల్ యాజమాన్యాలకు చేరి తద్వార విద్యార్థుల తల్లిదండ్రులకు వచ్చే వరకు 9.30 గంటలైంది.
కొన్ని చోట్ల ఉదయం 10గంటలకు పలు స్కూళ్లలో బంద్ పాటించారు. బస్సుల్లో స్కూళ్లకు వెళ్లే విద్యార్థులందరూ గంట నుంచి రెండు గంటల పాటు వానలోనే ఆయా మార్గాల్లో చక్కర్లు కొట్టాల్సి వచ్చింది. సొంత రవాణా, ప్రైవేటు వాహనాల్లో స్కూళ్లకు వచ్చే విద్యార్థులు సగానికి ఎక్కువ మంది తడిసి ముద్ద అయ్యారు. తెలంగాణ వ్యాప్తంగా రెడ్ అలర్ట్తో పాటుగా ఆరెంజ్ అలర్ట్ను ఐఎండి వెలువరించింది. వాతావరణ శాఖ హెచ్చరికలను సరైన సమయంలో విశ్లేషించడం చాలా ముఖ్యం. ప్రజలను అప్రమత్తం చేసి అనుకోని ఘటనల నుంచి కాపాడటం ప్రభుత్వ యంత్రాంగం విధి. ఇందుకు శాస్త్రీయ సమాచారాన్ని పరిగణలోకి తీసుకోవడంతో పాటుగా వీలైనంత త్వరగా ప్రజలను అప్రమత్తం చేయడం ముఖ్యమైంది. భవిష్యత్తులోనైనా కచ్చితమైన సమయానికి సరైన నిర్ణయం తీసుకోవాలని అధికార యంత్రాంగానికి ప్రజలంతా విజ్ఞప్తి చేస్తున్నారు.