సంగారెడ్డి : రైతులకు అన్ని విధాలుగా అండగా నిలుస్తూ వారి సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ పని చేస్తున్నారని జహీరాబాద్ ఎమ్మెల్యే కొనింటి మానిక్రావు, ఎమ్మెల్సీ ఫరీదుద్ధీన్ అన్నారు. మంగళవారం మండలంలోని రేజింతల్, హద్నూర్, న్యాల్కల్, చాల్కి, హుస్సేనగర్, హుస్సేల్లి, మామిడ్గి గ్రామాల్లో రైతు వేదికలు, న్యాల్కల్లోని ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రాన్ని ప్రారంభించారు. హరితహారం పథకంలో భాగంగా ఆయా గ్రామాల్లోని రైతు వేదిక పరిసరాల్లో మొక్కలను నాటారు. అనంతరం ఆయా గ్రామాల్లో ఏర్పాటు చేసిన సభల్లో వారు మాట్లాడుతూ.. రైతు బాగుంటేనే దేశం బాగుంటుందని సీఎం గుర్తించారు. ఆ దిశగా వ్యవసాయ రంగానికి మొదట ప్రాధ్యాన్యతనిచ్చి వారికి అన్ని సౌకర్యాలను కల్పిస్తున్నారన్నారని తెలిపారు.
అందులో భాగంగానే దేశంలో ఎక్కడా లేని విధంగా 24 గంటల నాణ్యమైన కరెంట్, రైతు బంధు, రుణ మాఫీ, రైతు బీమాను ప్రవేశపట్టి కంటికి రెప్పలా ప్రభుత్వం చూసుకుంటోందన్నారు. ఆయా గ్రామాల్లో నిర్మించిన రైతు వేదికలు రైతులకు ఎంతగానో ఉపయోగపడుతాయలన్నారు. సాగులో సమస్యలను రైతులు సమిష్టిగా చర్చించుకొని పరిష్కరించుకునే అవకాశం ఉంటుందన్నారు.
అలాగే సంగమేశ్వర ఎత్తిపోతల పథకం ద్వారా సాగు నీటిని అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. బ్యాంకు అధికారులు రైతులను ఇబ్బందులకు గురిచేయొద్దని వారు సూచించారు.
కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.