పేదల ఆత్మగౌరవ ప్రతీకలుగా గత కేసీఆర్ ప్రభుత్వం రూపాయి ఖర్చు లేకుండా అత్యంత పారదర్శకంగా నిర్మించి ఇచ్చిన డబుల్ బెడ్రూం ఇండ్లు.. నేటి కాంగ్రెస్ పాలనలో పైరవీకారుల పాలవుతున్నాయి. కేసీఆర్ హయాంలో లబ్ధిదారుల ఎంపిక కోసం డ్రా (లాటరీ) పద్ధతిని అమలు చేసి, అర్హులైన పేదలకే ఇండ్లు అందేలా పారదర్శక వ్యవస్థను తెస్తే.. ప్రస్తుత రేవంత్రెడ్డి ప్రభుత్వం ఆ వ్యవస్థను పూర్తిగా పకనపెట్టేసింది. దారిద్య్రరేఖకు దిగువన ఉండే నిరుపేదలకు చెందాల్సిన ఇండ్లు.. మంత్రుల సిఫార్సులు, అధికార పార్టీ నాయకుల ముడుపులు, సివిల్ సర్వీస్ అధికారుల అనుయాయులకే ప్రాధాన్యమిస్తూ అర్హులైన పేదల కడుపు కొడుతున్నది. కలెక్టర్ల పేరిట జాబితాలు తయారు చేయిస్తూ, లోపాయికారీగా మంత్రుల అనుచరులకే ఇండ్లను కట్టబెడుతున్న తీరు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఏ ప్రాంతంలో ఉన్న ఇండ్లను ఆ ప్రాంత నిరుపేదలకే కేటాయించాలనే ప్రాథమిక సూత్రాన్ని కూడా విస్మరించారు. దీనికి ప్రత్యక్ష నిదర్శనంగా మేడ్చల్ పరిధిలో కేసీఆర్ సరార్ నిర్మించిన ఇండ్లను ఏకంగా ఖమ్మం జిల్లాకు చెందిన వ్యక్తులకు కేటాయించారు. స్థానికంగా ఏళ్ల తరబడి గుడిసెల్లో, అద్దె ఇండ్లలో నరకం చూస్తున్న పేదలను వదిలేసి, మంత్రుల సిఫార్సు లేఖలతో పక జిల్లాల వారికి ఇండ్లు ఎలా కట్టబెడతారని స్థానికులు నిలదీస్తున్నారు.

సిటీబ్యూరో, జూలై 30 (నమస్తే తెలంగాణ ): హైదరాబాద్ జిల్లా ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ సిఫారసు చేస్తే ..నరేష్కుమార్కు ఖైత్లాపూర్లో డబుల్ బెడ్రూం దక్కింది. అలాగే రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సమర్పించిన సిఫారసుకు కుత్బుల్లాపూర్ రెవెన్యూ డిపార్ట్ మెంట్లో పనిచేస్తున్న ప్రత్యూషకు, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రికమండేషన్తో వి. సుదర్శనమ్మకు ఇండ్లను కేటాయించారు. ఇక మాజీ పీసీసీ అధ్యక్షుడు డి. శ్రీనివాస్ అల్లుడికి (శైలజ పేరు మీద) ఇండ్లను కేటాయించడమే కాకుండా, ఖమ్మంలో నివసించే మహిళకు కూకట్ పల్లిలో ఇల్లు ఇవ్వడం ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనం. సందట్లో సడేమియాలా సివిల్ సర్వీస్ అధికారులు సైతం రెచ్చిపోయారు. హౌసింగ్ బోర్డు వీసీ, హైదరాబాద్, రంగారెడ్డి కలెక్టర్ల పేర్లతో కొందరికి ఇండ్లు కేటాయించారు. దరఖాస్తు చేయని వారికీ కేటాయింపులు జరిపారు.
ఇండ్ల పంపిణీలో ‘చేతి’వాటం
కాంగ్రెస్ ప్రభుత్వం నిత్యం ప్రజలను మోసం చేయడమే పనిగా పెట్టుకుందని, నిరుపేదలకు చెందాల్సిన డబుల్ బెడ్రూం ఇండ్లను మంత్రులు, కలెక్టర్ల అనుచరులకు కట్టబెడుతూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోందని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. గత కేసీఆర్ ప్రభుత్వం రూపాయి ఖర్చు లేకుండా పేదలకు ఇండ్లు అందిస్తే, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం అక్రమాలు, పైరవీలకు అడ్డాగా మార్చేసిందని ధ్వజమెత్తారు. కూకట్పల్లి నియోజకవర్గ పరిధిలో ఖైత్లాపూర్లో కేసీఆర్ ప్రభుత్వం 145 డబుల్ బెడ్రూం ఇండ్లను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిందని పేర్కొన్నారు. నాలా పకన నరకయాతన అనుభవిస్తున్న అమృత్ నగర్ తండా వాసులకు, నిరుపేదలైన విలేకరులకు ఈ ఇండ్లను కేటాయించాలని తాము కలెక్టర్కు వినతిపత్రం ఇచ్చామని చెప్పారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అసలైన అర్హులను పకనపెట్టి పైరవీకారులకు కట్టబెడుతోందని విమర్శించారు.
హౌసింగ్ బోర్డు వీసీ, హైదరాబాద్, రంగారెడ్డి కలెక్టర్ల పేర్లతో కొందరికి ఇండ్లు కేటాయించిన తీరుపై మండిపడ్డారు. డబుల్ బెడ్రూం ఇండ్ల కోసం ఎలాంటి దరఖాస్తు చేసుకోని వ్యక్తులకు కూడా కాంగ్రెస్ మంత్రులు పైరవీ లేఖలతో గృహాలను కేటాయిస్తూ, లోపాయికారీగా డబ్బులు గుంజుకుంటూ అమ్ముకుంటున్నారన్నారు. మరోపక్క ప్రజలకు లక్ష ఇండ్లు ఇస్తామని మోసం చేయడమే కాకుండా, దరఖాస్తు పేరుతో పేదల నుంచి 10 వేల రూపాయలు వసూలు చేస్తున్నారని కృష్ణారావు అన్నారు.. రూ. 6 లక్షలు కడితేనే ఇండ్లు కేటాయిస్తామని చెబుతుండటం దారుణమని, అసలు నిరుపేదలకు ఆరు లక్షల రూపాయలు కట్టే స్థోమత ఉంటుందా? అని నిలదీశారు.
కేసీఆర్ హయాంలో ఒక రూపాయి కూడా తీసుకోకుండా అత్యంత పారదర్శకంగా పేదలకు డబుల్ బెడ్రూం ఇండ్లు అందించామని, కాంగ్రెస్ ప్రభుత్వం కనీస నిబంధనలు పాటించకుండా ఇష్టం వచ్చినట్లు కేటాయింపులు చేస్తున్నదన్నారు. కాంగ్రెస్ మంత్రులు తమ అనుచరులకు ఇష్టారాజ్యంగా ఇండ్లను కేటాయిస్తే ఊరుకునేది లేదని, ఈ అవినీతిపై హైకోర్టును ఆశ్రయిస్తామని ఎమ్మెల్యే మాదవరం కృష్ణారావు ఈ సందర్భంగా హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను, ఇండ్ల కేటాయింపుల్లో జరుగుతున్న అక్రమాలను ప్రజల ముంగిట ఎండగడతామన్నారు.

కేసీఆర్ మారు పారదర్శకత ఎకడ?
బీఆర్ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్రూం ఇండ్లను నిరుపేదలకు పంపిణీ చేసిన తీరు దేశానికే ఆదర్శంగా నిలిచింది. దాదాపు 67 వేల మంది నిరుపేదలకు రూ.లక్షల్లో విలువ చేసే ఇంటిని ఉచితంగా కేటాయింపులు జరిపారు. ఎలాంటి దళారీ వ్యవస్థ లేకుండా, లంచం ఇవ్వాల్సిన అవసరం లేకుండా, మీడియా సమక్షంలో ఆన్ లైన్ లాటరీ ద్వారా అత్యంత పారదర్శకంగా లబ్ధిదారులను ఎంపిక చేశారు. కానీ, కాంగ్రెస్ అధికారంలోకి రాగానే పరిస్థితి తలకిందులైంది.
‘ప్రజల ప్రభు త్వం’ అని చెప్పుకొంటున్న రేవంత్ రెడ్డి పాలనలో పేదల హకులు కాలరాస్తూ, మంత్రుల నియోజకవర్గాల్లోని తమ అనుచరులకు, కాంగ్రెస్ కార్యకర్తలకు ఇండ్ల నజరానాలు ఇచ్చుకుంటున్నారని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారుల చుట్టూ, ప్రజాప్రతినిధుల చుట్టూ తిరిగినా ఫలితం లేకుండా పోయిందని.. కేవలం కాంగ్రెస్ నాయకుల జేబులు నింపిన వారికే ఇండ్లు దకుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే ఈ అడ్డగోలు కేటాయింపులను రద్దు చేసి, కేసీఆర్ హయాంలో కేటాయించినట్లుగానే లాటరీ పద్ధతిలోనే అర్హులైన పేదలందరికీ ఇండ్లను పంపిణీ చేయకపోతే ఉద్యమిస్తామన్నారు.
