జనగామ : సమీకృత జిల్లా కార్యాలయాల భవన నిర్మాణంలో అసంపూర్తి పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు అన్నారు. జిల్లాలో మంత్రి నిర్మాణ పనులను తనిఖీ చేశారు. పచ్చదనం, మీటింగ్ హాల్, అధికారుల గదులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ నెలాఖరులోగా ముఖ్యమంత్రి పర్యటించనున్నందున కార్యాలయాల భవన సముదాయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దాలన్నారు.
ఆవరణలో మొక్కలు నాటడం త్వరగా పూర్తి చేయాలన్నారు. లైటింగ్ సిస్టం అన్ని ఏర్పాట్లు సమర్థవంతంగా ఉండాలని, ఎక్కడా ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూడాలని నిర్దేశించారు. పూర్తి స్థాయిలో క్లీనింగ్ పనులు వేగవంతం చేయాలన్నారు. సమీకృత కార్యాలయాల ఆవరణలోనే హెలీప్యాడ్ నిర్మాణానికి చర్యలు చేపట్టాలన్నారు.
జనగామ జిల్లా వేగంగా అభివృద్ధి చెందుతున్నట్లు ఆయన తెలిపారు.పెద్దమొత్తంలో రిజర్వాయర్లు జనగామ జిల్లాలోనే ఉన్నాయన్నారు. నీరు అందని గ్రామాల సర్వే చేసిఅన్ని గ్రామాలకు నీరందేలా చర్యలు చేపడతామన్నారు.
కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ పాగాల సంపత్ రెడ్డి, జిల్లా కలెక్టర్ కె. నిఖిల, జనగామ మున్సిపల్ చైర్ పర్సన్ పోకల జమున, డీసీపీ శ్రీనివాస్ రెడ్డి, అదనపు కలెక్టర్(స్థానిక సంస్థలు) అబ్దుల్ హమీద్, ఆర్ అండ్ బీ ఎస్ఈ మహేందర్ రావు, ఏసీపీ వినోద్ కుమార్, డీఆర్డీవో జి. రాంరెడ్డి, జెడ్పీ సీఈవో విజయలక్ష్మి, డీపీవో రంగాచారి, అధికారులు తదితరులు పాల్గొన్నారు.