తెలుగు ఇండస్ట్రీలోనే కాదు అన్నిచోట్లా ఇప్పుడు కరోనా మృత్యు తాండవం చేస్తుంది. పొద్దున్నే లేస్తే ఎవరి చావు వార్త వినాల్సి వస్తుందో అని భయపడుతున్నారు ఇండస్ట్రీ జనం. రోజూ కనీసం ఒక్కరైనా ఈ రక్కసి కోరల్లో చిక్కుకుని ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా మరో ప్రముఖుడు కూడా ఇలాగే కన్నుమూసారు. ప్రముఖ ఎడిటర్, సీనియర్ నటి ప్రభ సోదరుడు NGV ప్రసాద్ కరోనాతో కన్నుమూసారు. ఆయన వయసు 72 సంవత్సరాలు. మొన్నటి వరకు కూడా ఈయన ఆరోగ్యంగా ఉన్నారు. కుటుంబ సభ్యులతో హాయిగా గడుపుతున్నారు. రిటైర్మెంట్ తీసుకుని పిల్లలు, మనవళ్లతో జీవితం ఎంజాయ్ చేస్తున్నారు. అంతలోనే తన అన్నయ్యను కరోనా ఈ లోకం నుంచి తీసుకెళ్లిపోయిందంటూ ఏడ్చేసింది ప్రభ. కొన్ని రోజుల కింద కరోనా బారిన పడిన ఈయన.. చికిత్స పొందుతూ చెన్నై వెంకటేశ్వర ఆస్పత్రిలో మరణించారు. మే 3న ఈయన్ని అక్కడ చేర్పించారు.
6 రోజులుగా చికిత్స పొందుతున్న ప్రసాద్.. పరిస్థితి విషమించడంతో మరణించారు. సీనియర్ నటి ప్రభ ఈయనకు చెల్లి. ఈమెకు ఇద్దరు అన్నయ్యలు ఉండగా.. ప్రసాద్ చిన్న అన్నయ్య. ఈయన పలు తెలుగు-తమిళ చిత్రాలకు ఎడిటర్గా పని చేసారు. ముఖ్యంగా పాటలు ఎడిట్ చేయడంలో ప్రసాద్ చాలా పేరు తెచ్చుకున్నారు. సీనియర్ దర్శకులందరితోనూ పని చేసారు. మరీ ముఖ్యంగా తెలుగులో లెజెండరీ దర్శకుడు కోదండరామి రెడ్డితో ఎక్కువ సినిమాలకు పని చేసారు. చిరంజీవి నటించిన సినిమాలకు కూడా బాగానే ఎడిట్ చేసాడు ప్రసాద్. తన అన్నయ్య ఆకస్మిక మరణం తట్టుకోలేకపోతున్నానని.. ఆయన మరణవార్త జీర్ణించుకోడానికి చాలా సమయం పడుతుందని చెప్పింది ప్రభ. కాగా ప్రసాద్ మృతికి పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేసారు.