మంచిర్యాలటౌన్, జూన్ 21: నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్ )-2026 రీ ఎగ్జామ్ ఆదివారం ప్రశాంతంగా కొనసాగింది. మెడికల్, దంత విద్య కోర్సులు చదవాలనుకునే విద్యార్థుల కోసం జాతీయస్థాయిలో ని ర్వహించే ఈ ప్రవేశ పరీక్ష కోసం మంచిర్యాల జిల్లా కేంద్రంలో 5 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. మొత్తం 1204 మంది విద్యార్థులు నీట్ పరీక్ష రాయాల్సి ఉండగా, 1087 మంది హాజరయ్యారు. బస్టాండు పక్కన ఉన్న జడ్పీ బాలుర పాఠశాలలో 264 మంది పరీక్ష రా యాల్సి ఉండగా, 249 మంది హాజరయ్యా రు. మార్కెట్ ఏరియాలోని జడ్పీ బాలికల పాఠశాలలో 240 మందికిగాను 215 మంది, కాలేజీరోడ్లోని గర్మిళ్ల ప్రభుత్వ పాఠశాలలో 192 మందికి 167 మంది, రాజీవ్నగర్లోని తెలంగాణ మోడల్ స్కూల్లో 288 మంది పరీక్ష రాయాల్సి ఉండగా, 256 మంది పరీక్షరాశారు. ఇక కాలేజీరోడ్లోని ప్రభుత్వ డిగ్రీకాలేజీలలో 220 మందికిగాను 198 మంది హాజరయ్యారు.
మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5.15 గంటల వరకూ పరీక్ష కొనసాగింది. బయోమెట్రిక్ విధానంలో హాజరు తీసుకోవడం కోసం విద్యార్థులను ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకూ కేంద్రాల్లోకి అనుమతించారు. ఇంత సమయం ఇచ్చినా విద్యార్థులకు ఉరుకులు, పరుగులు తప్పలేదు. జడ్పీ బాలికల పాఠశాలలో సెంటర్ పడ్డ ఓ విద్యార్థి జడ్పీ బాలుర పాఠశాలలోకి వెళ్లగా, సమయం 10 నిమిషాలే ఉండడంతో అక్కడే విధుల్లో ఉన్న సీఐ ప్రమోద్రావు పోలీసు వాహనంలో తరలించారు. ప్రభుత్వ డిగ్రీకాలేజీలో ఏర్పాటు చేసిన కేంద్రానికి వచ్చిన విద్యార్థిని ఒత్తిడిలో పాస్పోర్ట్సైజ్ ఫొటో తీసుకురావడం మరిచిపోయింది.
బాధతో బయటకు వచ్చిన ఆ విద్యార్థినిని గమనించిన భీమారం ఎస్ఐ రాజేందర్ ఆమెను దగ్గరలో ఉన్న ఫొటో స్టూడియోకు తీసుకెళ్లి సాయపడ్డారు. మంచిర్యాలలో ఏర్పాటు చేసిన కేంద్రాలను డీసీపీ ఎగ్గడి భాస్కర్, ఏసీపీ ప్రకాశ్ పరిశీలించారు. పరీక్ష నిర్వహణ కోసం 12 మంది విద్యార్థులకు ఒక ఇన్విజిలెటర్, పరీక్ష కేంద్రానికి ఒక చీఫ్ సూపరింటెండెంట్, అబ్జర్వర్ను నియమించారు. మంచిర్యాలలో నిర్వహించిన నీట్ రీఎగ్జామ్ ప్రశాంతంగా కొనసాగిందని సిటీ కో ఆర్డినేటర్, డిస్ట్రిక్ నోడల్ ఆఫీసర్, డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్ జైకిషన్ ఓఝా తెలిపారు.
మంచిర్యాల అర్బన్, జూన్ 21 : నీట్ రీ పరీక్ష ప్రశాంతంగా జరిగినట్లు రామగుండం సీపీ అంబర్ కిశోర్ ఝా అన్నారు. ఆదివారం డీసీపీ భాసర్తో కలిసి జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల, ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన కేంద్రాలను సందర్శించారు. బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించి, పరీక్షకు హాజరైన అభ్యర్థుల సంఖ్య, భద్రతా ఏర్పాట్ల గురించి సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రశ్నాపత్రాలు, ఇతర పరీక్షా సామగ్రిని సురక్షితంగా గమ్యస్థానాలకు తరలించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.
ఆసిఫాబాద్, జూన్ 21 : జిల్లాలో నీట్ పరీక్ష ప్రశాంత వాతావరణంలో, పారదర్శకంగా నిర్వహించినట్లు కలెక్టర్ హరిత తెలిపారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాలలో ఏర్పాటు చేసిన కేంద్రాన్ని ఆమె పరిశీలించారు. సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పరీక్షా కేంద్రంలో అభ్యర్థులకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించామని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశామని తెలిపారు. పరీక్షల నిర్వహణకు సంబంధించిన మార్గదర్శకాలను అధికారులు, సిబ్బంది పకడ్బందీగా అమలు చేశారని చెప్పారు. మొత్తం 363 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా, 326 మంది హాజరయ్యారు.