పర్వతగిరి, జూన్ 21 : ఓ మైనర్ డ్రైవింగ్ ముగ్గురి ప్రాణాలు బలిగొంది. ఈ ఘటన వరంగల్ జిల్లా పర్వతగిరి మండలకేంద్రంలో చోటుచేసుకుంది. ఓ విద్యార్థి అక్కడికక్కడే మృతి చెందగా, ఎంజీఎం దవాఖానలో చికిత్స పొందుతూ మరో ఇద్దరు మృత్యువాత పడ్డారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. స్థానికుల కథనం ప్రకారం.. పర్వతగిరి మండలకేంద్రానికి చెందిన బుద్దె మమత భర్త విజేందర్ సుమారు పదేళ్ల క్రితం మరణించాడు. ఆమెకు ఇద్దరు కుమారులు ఉన్నారు. మమత కేజీబీవీలో తాత్కాలిక పద్ధతిలో వంట మనిషిగా పని చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నది. పెద్ద కుమారుడైన బుద్దె చరణ్(16) ఇంటర్ ఫస్టియర్ పూర్తి చేశాడు. ఆదివారం సాయంత్రం తన స్నేహితుడి బైక్పై చరణ్ బయటకు వెళ్లాడు. ఇదేరోజు రాత్రి బైక్పై తిరిగి పర్వతగిరి వైపు వస్తున్నారు. అయితే, చరణ్ బైక్ డ్రైవింగ్ చేస్తున్నాడు.
ఈ క్రమంలో ప ర్వతగిరి నుంచి సోమారం గ్రామానికి చెందిన వడ్లకొండ ఎల్లాగౌడ్(60), ఎండీ అహ్మద్(58) ద్విచక్ర వాహనంపై వెళ్తున్నారు. మండలకేంద్రంలోని మోడల్ సూల్ సమీపంలోకి చేరుకోగానే ఎదురెదురుగా రెండు బైక్లు బలంగా ఢీకొన్నాయి. దీంతో చరణ్ అక్కడికక్కడే మృతి చెందాడు. గాయపడిన చరణ్ స్నేహితుడితోపాటు ఎల్లాగౌడ్, అహ్మద్ను అంబులెన్స్లో వరంగల్ ఎంజీఎం దవాఖానకు తరలిస్తున్నారు. మార్గమధ్యంలో అహ్మద్ మృతి చెందాడు. అనంతరం ఎంజీఎంహెచ్ చికిత్స పొందుతూ ఎల్లాగౌడ్ మృత్యువాత పడ్డాడు. చరణ్ స్నేహితుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు స్థానికులు తెలిపారు. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.