న్యూయార్క్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో షాక్ ఇచ్చారు. ఇప్పటికే హెచ్-1బీ వీసా, గ్రీన్కార్డులపై ఎన్నో ఆంక్షలు పెడుతున్న ట్రంప్.. ఇప్పుడు జన్మతః వచ్చే పౌరసత్వాన్ని నియంత్రించేందుకు రెండు కొత్త ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ల మీద సంతకం చేశారు. దీని ముఖ్య ఉద్దేశం అమెరికాలో విదేశీయుల పిల్లలకు జన్మతః పౌరసత్వాన్ని రాకుండా చేయడమే. అమెరికాలో పుట్టిన వారందరినీ అమెరికన్లుగానే పరిగణించాలని యూఎస్ సుప్రీంకోర్టు గత నెలలో తీర్పునిచ్చిన క్రమంలో ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ సారి మరికొన్ని మార్పులు చేస్తున్నామని చెప్పారు.
1986లో అమోదించిన 14వ రాజ్యాంగ సవరణ ప్రకారం.. విదేశీయులు అమెరికాకు వచ్చి జన్మనిస్తే వారి పిల్లలకు జన్మతః అమెరికా పౌరసత్వం దక్కుతుంది. దీన్ని నియంత్రించాలని ట్రంప్ చాలా ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు ట్రంప్ తీసుకొస్తున్న ఉత్తర్వుల వల్ల భారతీయుల పిల్లలు అమెరికా పౌరసత్వం పొందడం చాలా కష్టతరం అయ్యేలా ఉంది. ప్రతి ఏటా భారతీయుల పిల్లలు 2.5 లక్షల మంది అమెరికాలో జన్మిస్తున్నారు. ఇప్పుడు వారందరికీ పౌరసత్వం విషయంలో ఇబ్బందులు ఎదురు కానున్నాయి.
యూఎస్లో పనిచేయడానికి వీసాల కోసం ఐప్లె చేసుకునే విదేశీ జర్నలిస్టులకు ట్రంప్ ప్రభుత్వం కొత్త రూల్ తీసుకొచ్చింది. ఇక నుంచి వారి సోషల్ మీడియా ఖాతాలను కూడా పరిశీలించనున్నట్టు యూఎస్ స్టేట్ డిపార్టుమెంట్ తెలిపింది. ట్రంప్ రూల్ ప్రకారం అమెరికా వీసా కావాలనుకునేవారు కచ్చితంగా వారి సోషల్ మీడియా ఖాతాలను వెల్లడించాల్సిందే. ఇప్పుడు ఈ రూల్ను అంతర్జాతీయ మీడియా ప్రతినిధులకు కూడా విస్తరించనున్నారు. యూఎస్ స్టేట్ డిపార్ట్ మెంట్ ప్రతినిధి మాట్లాడుతూ.. విదేశీ జర్నలిస్టులు యూఎస్ వీసాకు అర్హులా కాదా అనే విషయాన్ని వారి సోషల్ మీడియా ఖాతాల ద్వారా తెలుసుకున్న తర్వాతే జారీ చేస్తామని ఇది అత్యంత కీలకమని తెలిపారు.