న్యూఢిల్లీ, ఆగస్టు 7: భారత దేశం వృద్ధాప్యం దిశగా అడుగులు వేస్తున్నది. 2050 నాటికి దేశంలోని ప్రతి ఐదుగురిలో ఒకరు 60 ఏండ్లు, అంతకు పైబడిన వయసు వారు ఉంటారని ట్రాన్స్ఫార్మ్ రూరల్ ఇండియా వెల్లడించింది. అందులో 70 శాతం మంది గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తారని తెలిపింది. శుక్రవారం ఈ సంస్థ నివేదిక విడుదల చేసింది. ‘గ్రామీణ భారత దేశంలో జనాభా పరిణామాలు, మారుతున్న కుటుంబ వ్యవస్థ, సంరక్షణ వ్యవస్థ భవిష్యత్’ పేరిట ఈ సంస్థ నివేదిక విడుదల చేసింది. జనాభా వృద్ధులుగా మారకముందే సంపన్న దేశాలుగా మారిన అనేక అభివృద్ధి చెందిన దేశాలకు భిన్నంగా భారత్ సంపద దేశంగా మారక ముందే వృద్ధాప్య దశలోకి అడుగుపెడుతున్నదని ఈ నివేదిక హెచ్చరించింది.
2050 నాటికి దేశ జనాభాలో 34.7 కోట్ల మంది 60 ఏండ్ల పైబడిన వారు ఉంటారని, ప్రతి పదిమందిలో ఏడుగురు గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తారని తెలిపింది. అధిక శాతం జనాభా వృద్ధులుగా మారకముందే పలు అభివృద్ధి చెందిన దేశాలు సంపన్న దేశాలుగా మారాయన్నారు. అయితే భారత దేశం తక్కువ ఆదాయ స్థాయిల వద్దే జనాభా సంబంధిత పరివర్తనను ఎదుర్కొంటున్నదని ఆ నివేదిక వెల్లడించింది. ప్రతి వృద్ధునికి అండగా నిలిచే పని వయసు గల వయోజనుల సంఖ్య 2001 నాటికి 8.4 ఉండగా, 2026 నాటికి అది 5.2కు తగ్గిపోయిందని తెలిపింది. దీనివల్ల కుటుంబాలు, సమాజంపై ఒత్తిడి పెరుగుతుందని పేర్కొంది.