న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి మరోసారి పంజావిసిరింది. రెండో దశలో ప్రాణాంతక వైరస్ ర్యాపిడ్ స్పీడ్తో విజృంభిస్తున్నది. దీంతో దేశంలో కొత్తగా లక్షకు పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. భారత్లో కరోనా కేసులు ప్రారంభమైనప్పటి నుంచి ఒక్క రోజులో లక్ష కేసులు నమోదవడం ఇదే మొదటిసారి.
దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 1,03,558 మంది కరోనా పాజిటివ్లుగా నిర్ధారణ అయ్యారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,25,89,067కు చేరింది. ఇందులో 1,16,82,136 మంది మహమ్మారి బారినుంచి కోలుకోగా, 1,65,101 మంది బాధితులు మరణించారు. రోజువారీ కేసులు భారీగా నమోదవుతుండటంతో రోజురోజుకు యాక్టివ్ కేసులు కూడా పెరిగిపోతున్నాయి. దేశంలో ప్రస్తుతం 7,41,830 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. కాగా, నిన్న ఉదయం నుంచి ఇప్పటివరకు 52,847 మంది వైరస్నుంచి కోలుకుని డిశ్చార్జీ అయ్యారని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. కొత్తగా మరో 478 మంది మరణించారని వెల్లడించింది. దేశంలో ఇప్పటివరకు 7,91,05,163 మందికి కరోనా వ్యాక్సిన్ పంపిణీ చేశామని తెలిపింది.
కేవలం నెలన్నర వ్యవధిలోనే పాజిటివ్ కేసులు పది రెట్లకుపైగా పెరిగాయి. ఫిబ్రవరి 16న దేశవ్యాప్తంగా 9121 కేసులు నమోదయ్యాయి. ఏప్రిల్ ఒకటి నాటికి ఈ సంఖ్య 90 వేలు దాటింది. రోజువారీ కేసులు ఇంత భారీగా నమోదవడం గతేడాది సెప్టెంబర్ తర్వాత ఇదే మొదటిసారి. గత కొన్నిరోజులుగా మహారాష్ట్ర, పంజాబ్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్లో అత్యధిక కేసులు నమోదవుతున్నాయి. కొత్తగా నమోదైన పాజిటివ్ కేసుల్లో ఒక్క మహారాష్ట్రలోనే 57 వేలకు పైగా ఉండటం గమనార్హం. మొత్తంగా పది రాష్ట్రాల్లోనే 91 శాతం కేసులు నమోదవుతున్నాయని కేంద్ర ప్రభుత్వ గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..