ఏ ముహూర్తంలో ఇండియాలో కరోనా అడుగు పెట్టిందో తెలియదు కానీ..అప్పటినుంచి ఇప్పటివరకు అది అందరికీ చుక్కలు చూపిస్తూనే ఉంది. మరీ ముఖ్యంగా సినిమా వాళ్లతో పట్టపగలే చుక్కలు లెక్క పెట్టిస్తుంది. తగ్గినట్లు ఉంటుంది కానీ తగ్గదు. సినిమాలు విడుదల చేసుకుందాం అంటే పరిస్థితులు సహకరించడం లేదు. 2021 మొదట్లో ఒక మూడు నాలుగు నెలలు మాత్రం పర్లేదులే అనిపించింది. మళ్లీ రెండోదశ అంటూ నరకం చూపించింది. ప్రస్తుతానికి కేసులు తక్కువగా వస్తున్నాయి.. మెల్లగా సినిమాలు విడుదల చేద్దాం అనుకుంటున్న సమయంలో ఒక్కసారిగా కేసులు పెరుగుతుండడం అందరిలోనూ కంగారు పుట్టిస్తోంది. మొన్నటి వరకు దేశవ్యాప్తంగా చూసుకుంటే 30,000 కంటే దిగువకు వచ్చిన కేసుల సంఖ్య.. ఇప్పుడు మళ్ళీ 44 వేలకు చేరుకుంది.
ఒక్క రోజులో 15 వేల కేసులు ఎక్కువగా రావడంతో అందరికంటే ఎక్కువగా సినిమా ఇండస్ట్రీ కంగారు పడుతుంది. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే మూడోదశ కూడా మొదలైపోయినట్టే అంటూ వైద్య ఆరోగ్య శాఖ హెచ్చరికలు కూడా జారీ చేస్తోంది. షూటింగ్స్ అయితే చేస్తున్నారు కానీ షూటింగ్ అయిపోయిన సినిమాల పరిస్థితి మాత్రం అగమ్యగోచరంగా మారిపోయింది. ఒక్క తెలుగు ఇండస్ట్రీలోనే దాదాపు 40 సినిమాల వరకు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. అందులో చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున, నాని, పవన్ కళ్యాణ్, ప్రభాస్ లాంటి హీరోల సినిమాలు కూడా ఉన్నాయి. గత ఏడాదిన్నర కాలంగా సినిమా ఇండస్ట్రీ దాదాపు 2 వేల కోట్లు నష్టపోయిందని ఒక అంచనా. ఇప్పటికిప్పుడు థియేటర్లు తెరుచుకొని సినిమాలు అద్భుతంగా పర్ఫార్మ్ చేస్తే తప్ప నష్టాలు కాస్తయినా భర్తీ కావు.
తెలుగు రాష్ట్రాలలో కూడా వైరస్ ఇంకా పూర్తిగా అదుపులోకి రాలేదు. తెలంగాణలో ఇప్పటికీ రోజుకు 500 పైగా కేసులు వస్తున్నాయి. మరోవైపు ఏపీలో కేసులు 2 వేలకు చేరువగా ఉన్నాయి. ఈ క్రమంలో థియేటర్లు తెరిచినా కూడా ప్రేక్షకులు సినిమా చూడడానికి వస్తారా..? అనే అనుమానాలు కూడా లేకపోలేదు. ఇన్ని ఆటంకాల మధ్య కొత్త సినిమాలు ఎప్పటి నుంచి విడుదల అవుతాయో చూడాలి.
ఇవి కూడా చదవండి..
అసిస్టెంట్ డైరెక్టర్ గా బిగ్ బాస్ బ్యూటీ
రాజ్ కుంద్రా బెయిల్ తిరస్కరణ..గెహనా వశిష్ఠ్ పై కేసు
షూటింగ్స్ తో ఢిల్లీ భామ బిజీ షెడ్యూల్..!
‘మోస్ట్ హ్యాండ్సమ్ ఏసియన్ మ్యాన్ ’ గా ప్రభాస్
తరుణ్, ఉదయ్కిరణ్తో నన్ను పోల్చొద్దు: వరుణ్ సందేశ్
ప్రియమణి-ముస్తఫారాజ్ వివాహం చెల్లదు..