హైదరాబాద్: దేశవ్యాప్తంగా తిరిగి కరోనా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో, ప్రభుత్వ నిబంధనలను పాటించాలని రాష్ట్ర ప్రజలను ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు కోరారు. ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించి సునిశిత జాగ్రత్తలు పాటించాలని, కరోనా కట్టడికోసం ప్రతి క్షణం అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు.
రాష్ట్రంలో ముఖ్యంగా జనం రద్దీగా ఉండే హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల ప్రజలతోపాటు కార్పోరేషన్లు, మున్సిపాలిటీల ప్రజలు కరోనా పట్ల మరింత అప్రమత్తతతో మెలగాలని సీఎం సూచించారు. గురువారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిర్వహించిన సీఎంల వీడియో కాన్ఫరెన్స్ లో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. ఆ తర్వాత రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై సీఎం కేసీఆర్ వైద్య, ఆరోగ్య శాఖ అధికారులతో సమీక్షించారు.
రాష్ట్రంలో కరోనా తిరిగి పునరావృతమౌతున్న నేపథ్యంలో కరోనా పరీక్షలను భారీగా పెంచాలని అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు. అన్ని విభాగాల ఫ్రంట్ లైన్ వర్కర్లకు వందశాతం వ్యాక్సినేషన్ చేయించాలన్నారు. ఈ ప్రక్రియను వారం రోజుల్లో యుద్ద ప్రాతిపదికన పూర్తి చేయాలన్నారు.
డీజీపీ మహేందర్ రెడ్డి, పంచాయతీ రాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్ కుమార్, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్, రవాణా శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి సునీల్ శర్మలతో సీఎం కేసీఆర్ ఫోన్ మాట్లాడారు.
ఆయా శాఖల్లో పనిచేసే సిబ్బంది మొత్తానికి వాక్సినేషన్ ప్రక్రియను వారం రోజుల్లో నూటికి నూరు శాతం పూర్తి చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. వాక్సినేషన్ పురోగతిని ప్రతీ రోజు ఆయా శాఖల ఉన్నతాధికారులు సీఎంవోకు రిపోర్ట్ చేయాలని స్పష్టం చేశారు.
పోలీస్, పంచాయతీ రాజ్, మున్సిపల్, ఆర్టీసీ , రెవెన్యూ శాఖల సిబ్బందికి వందశాతం వ్యాక్సినేషన్ ప్రక్రియ చేపట్టడం కోసం కలెక్టర్లు, ఇతర జిల్లా స్థాయి అధికారులతో వెంటనే వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి, స్పెషల్ డ్రైవ్ చేపట్టాలని సీఎం చెప్పారు.
కరోనా పరీక్షల సంఖ్యను భారీగా పెంచేందుకు, అన్ని జిల్లాల్లోనూ కరోనాను నిర్ధారించే ఆర్టీపీసీఆర్ పరీక్షా కేంద్రాలను విస్త్రుతంగా ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. అవసరమైన మేరకు ఆర్టీపీసీఆర్ కిట్లు తక్షణమే తెప్పించాలని అధికారులను ఆదేశించారు.
గద్వాల, వనపర్తి, ఖమ్మం, కొత్తగూడెం, మహబూబాబాద్, నిర్మల్, మంచిర్యాల, కామారెడ్డి, సంగారెడ్డి, మెదక్, జగిత్యాల, పెద్దపల్లి, రామగుండం, భువనగిరి, జనగామ, వికారాబాద్ జిల్లా కేంద్రాల్లో తక్షణమే ఆర్టీపీసీఆర్ పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయాలని వైద్య అధికారులను సీఎం ఆదేశించారు.
కరోనా నియంత్రణకు కీలక మాస్క్లు ధరించే నిబంధనను కఠినంగా అమలు పరచాలని సీఎం కేసీఆర్ వెల్లడించారు. మాస్క్లు ధరించని వారిపై వేయి రూపాయల జరిమానా విధించేలా ఇప్పటికే ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
ప్రజా శ్రేయస్సు దృష్ట్యా ఈ నిబంధనను అందరూ పాటించేలా పోలీస్ శాఖ చర్యలు తీసుకోవాలని డీజీపీని సీఎం కేసీఆర్ ఆదేశించారు. 45 ఏండ్లు పైబడిన వారందరూ వ్యాక్సినేషన్ చేయించుకోవాలని సీఎం ప్రజలను కోరారు.
ఈ సమీక్షా సమావేశంలో మంత్రులు ఈటల రాజేందర్, సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్ రెడ్డి, హర్షవర్ధన్ రెడ్డి, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి రామకృష్ణారావు, వైద్యారోగ్య శాఖ కార్యదర్శి రిజ్వి, వైద్యారోగ్య శాఖ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాస్ రావు, డీఎంఈ శ్రీ రమేష్ రెడ్డి, టీఎస్మెస్ ఎండీ ఐడిసీ చంద్రశేఖర్, వైద్యశాఖ సలహాదారు డాక్టర్ టి గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.
ఏసీలు, ఎల్ఈడీ లైట్ల కోసం పీఎల్ఐ పథకం
మహీంద్రాతో ఫ్లిప్కార్ట్ డీల్
హోంలోన్ కావాలా.. టాప్ 10 ప్రైవేట్ బ్యాంకుల్లో ఇలా బెస్ట్