హైదరాబాద్, ఏప్రిల్ 7 (నమస్తే తెలంగాణ): మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ (మెయిల్) మరో ఘనతను సాధించింది. దేశంలో తొలిసారిగా పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో మేఘా తయారు చేసిన ఆయిల్ డ్రిల్లింగ్ రిగ్ విజయవంతమైంది. గుజరాత్లోని అహ్మదాబాద్లోగల కలోల్ చమురు క్షేత్రాల్లో ఈ రిగ్ బుధవారం నుంచి డ్రిల్లింగ్ చేయడం మొదలు పెట్టింది. ఈ మేరకు మెయిల్ ప్రకటించింది. 2019లో 47 డ్రిల్లింగ్ రిగ్గుల తయారీకి సంబంధించి రూ.6వేల కోట్ల విలువైన కాంట్రాక్టును మేఘా దక్కించుకున్న విషయం తెలిసిందే. ఇందులో తొలి రిగ్గును కలోల్ చమురు క్షేత్రంలో బిగించారు. ఇక మిగతా 46 రిగ్గుల్లో రెండింటిని ఆంధ్రప్రదేశ్లోని రాజమండ్రిలో ఏర్పాటు చేస్తున్నారు. మిగిలిన వాటిని అస్సోం, త్రిపుర, తమిళనాడుల్లోని ఓఎన్జీసీ చమురు క్షేత్రాలకు సరఫరా చేస్తున్నారు. కాగా, అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో తయారవుతున్న ఈ రిగ్గులు.. హైడ్రాలిక్ వ్యవస్థతో పనిచేస్తాయి. 1,500 హెచ్పీ సామర్థ్యం కలిగిన వీటితో చమురు బావుల్లో భూ ఉపరితలం నుంచి 4 కిలోమీటర్ల మేర సులువుగా తవ్వేయవచ్చు. అంతేగాక 40 ఏండ్లపాటు ఇవి పనిచేస్తాయి. మేకిన్ ఇండియాలో భాగంగానే ప్రైవేటు రంగంలో భారీ స్థాయిలో ఆయిల్ రిగ్గులను తయారు చేస్తున్నామని మెయిల్ ఉపాధ్యక్షుడు పీ రాజేశ్ రెడ్డి ఈ సందర్భంగా తెలిపారు. రిగ్గుల తయారీ గర్వంగా ఉందన్న ఆయన ఓఎన్జీసీకి అందించడం సంస్థకు మరింత ప్రతిష్ఠాత్మకం అన్నారు. తొలి రిగ్గు విజయవంతం కావడంపట్ల ఆనందం వ్యక్తం చేశారు.