Rechni Road Railway Station | తాండూర్, ఏప్రిల్ 7: తాండూర్ మండలం రేచిని రోడ్ రైల్వే స్టేషన్కు వెళ్లే ప్రధాన రహదారి ఇప్పుడు తీవ్ర వివాదానికి దారి తీస్తోంది.
అధికారిక రికార్డుల ప్రకారం తారు రోడ్ పనులు పూర్తై బిల్లులు క్లియర్ చేసినట్లు చూపుతున్నప్పటికీ, వాస్తవ పరిస్థితి మాత్రం పూర్తిగా భిన్నంగా ఉంది. గ్రౌండ్ రియాలిటీ చూస్తే రహదారి మొత్తం గుంతలతో నిండిపోయి, ప్రయాణానికి పనికిరాని స్థితిలో ఉంది. కొత్తగా వేసిన రోడ్ కొద్ది రోజుల్లోనే పాడైపోవడం నాణ్యతా ప్రమాణాలు పాటించలేదనే అనుమానాలకు బలం చేకూరుస్తోంది. దీంతో పనులు సరిగా చేయకుండానే బిల్లులు లేపినట్లుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఈ వ్యవహారం రాజకీయ రంగు కూడా దాల్చింది. ప్రతిపక్ష నాయకులు అధికార పార్టీపై తీవ్ర విమర్శలు గుప్పిస్తూ, పనులు చేయకుండానే బిల్లులు క్లియర్ కావడం వెనుక రాజకీయ ఆశీర్వాదం లేకుండా సాధ్యం కాదని ఆరోపిస్తున్నారు. అధికారులు, కాంట్రాక్టర్లు, రాజకీయ నాయకుల మధ్య కుమ్మక్కు జరిగిందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. స్థానిక ప్రజలు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘డాంబర్ (తారు) పేరుతో కేవలం పలుచని పొర వేసి, ఫోటోలు తీసి పని పూర్తయ్యిందని చూపించారు. కానీ కొన్ని రోజుల్లోనే రోడ్ పూర్తిగా పాడైపోయింది’అంటూ మండిపడుతున్నారు.
ప్రజల డబ్బును దోచుకునే ప్రయత్నం..
ఇది సాధారణ నిర్లక్ష్యం కాదని, ప్రజల డబ్బును దోచుకునే ప్రయత్నమని అంటున్నారు. ఈ రహదారి మీద ప్రయాణించే వందలాది మంది ప్రజలు రోజూ ఇబ్బందులు పడుతున్నారు. గుంతల్లో పడుతూ వాహనాలు దెబ్బతినడం, ప్రమాదాలు చోటుచేసుకోవడం నిత్యకృత్యమైపోయింది. అత్యవసర సేవలకు కూడా ఈ మార్గంలో అంతరాయం ఏర్పడుతుంది. వర్షాకాలం వస్తే పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారనుంది.
గుంతల్లో నీరు నిలిచి రోడ్ పూర్తిగా కనిపించకుండా పోవడం ప్రాణాలకు ముప్పుగా మారుతుందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు ఈ వ్యవహారంపై ప్రత్యేక విచారణ చేపట్టి, టెండర్లు, బిల్లులు, పనుల నాణ్యతపై పూర్తి వివరాలు బయటపెట్టాలని ప్రజలు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. ఇందులో ఎవరైనా దోషులైతే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
నేను కొత్తగా వచ్చాను.. నాకు వివరాలు ఏమీ తెలియదు : పంచాయతీరాజ్ ఏఈ టీ సాయిలత, తాండూరు
తాండూర్ మండల పంచాయతీరాజ్ ఏఈ టీ సాయిలతను రోడ్డు నిర్మాణం చేపట్టిన సంవత్సరం, నిధులు, పనుల వివరాల గురించి వివరణ అడిగితే తాను కొత్తగా వచ్చాను. తమ కార్యాలయంలో ఎలాంటి సమాచారం లేదని దాటవేశారు. డీఈ సంతోష్ను అడిగినా కూడా తాను కూడా కొత్తగా వచ్చాను ఏమీ తెలియదన్నారు. రోడ్డు మాత్రం పూర్తిగా గుంతలమయంగా మారిందని కాంట్రాక్టర్ మెయింటైనెన్స్ పీరియడ్ అయిపోయిందని, తిరిగి రోడ్ ప్యాచ్ వర్క్ పనులకు ప్రతిపాదనలు పంపిస్తామన్నారు.



Reservoirs | తెలంగాణలో తీవ్ర నీటి సంక్షోభం.. డెడ్ స్టోరేజ్ దిశగా తెలంగాణ జలాశయాలు
Anant Ambani | ఆధ్యాత్మిక సేవలో అంబానీ వారసుడు.. గురువాయూర్, రాజరాజేశ్వరం ఆలయాలకు రూ.18 కోట్ల సాయం!
New Shayampet | కాలుష్య కోరల్లో చెరవులు..పట్టించుకోని అధికారులు