AnantAmbani | రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనంత్ అంబానీ కేరళలోని ప్రముఖ దేవాలయాల అభివృద్ధికి, ఏనుగుల సంక్షేమానికి భారీ విరాళం ప్రకటించారు. పవిత్రమైన గురువాయూర్ మరియు రాజరాజేశ్వరం దేవాలయాలను సందర్శించిన ఆయన, మొత్తం 18 కోట్ల రూపాయల ఆర్థిక సాయాన్ని అందజేయనున్నట్లు వెల్లడించారు. ఇందులో భాగంగా రెండు దేవాలయాలకు చెరో 3 కోట్ల రూపాయల చొప్పున మొత్తం 6 కోట్ల రూపాయలను తక్షణ విరాళంగా అందజేశారు. అలాగే చారిత్రక ప్రాధాన్యత కలిగిన రాజరాజేశ్వరం ఆలయ తూర్పు గోపుర పునరుద్ధరణ పనుల కోసం మరో 12 కోట్ల రూపాయలను కేటాయించాడు. దాదాపు రెండు శతాబ్దాలుగా శిథిలావస్థలో ఉన్న ఈ పురాతన గోపురాన్ని పునరుద్ధరించడం భక్తులకు మరియు ఆలయ అధికారులకు ఒక చారిత్రక ఘట్టంగా నిలవనుంది.
ఆలయ సందర్శనలో భాగంగా అనంత్ అంబానీ మాట్లాడుతూ.. భారతదేశ ఆధ్యాత్మిక సంప్రదాయాలు కేవలం ప్రార్థనా స్థలాలు మాత్రమే కావని, అవి మన విశ్వాసాన్ని, సామాజిక స్పృహను, ప్రకృతితో మనకున్న అనుబంధాన్ని ప్రతిబింబించే సజీవ సంస్థలని పేర్కొన్నాడు. మన పవిత్ర వారసత్వాన్ని భవిష్యత్తు తరాలకు అందించడం మనందరి బాధ్యత అని ఆయన అన్నారు. భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తూనే, మన సంప్రదాయాల్లో అంతర్భాగమైన జంతువులకు గౌరవప్రదమైన మరియు శాస్త్రీయమైన సంరక్షణ అందించడమే తన లక్ష్యమని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్లు, ప్రధాన అర్చకులు మరియు బోర్డు సభ్యులు పాల్గొని అనంత్ అంబానీని సంప్రదాయబద్ధంగా గౌరవించి ప్రసాదాలను అందజేశారు.