హైదరాబాద్, ఆగస్టు 4 (నమస్తే తెలంగాణ): సీఎం రేవంత్రెడ్డి మరో రికార్డును తన ఖాతాలో వేసుకొన్నారు. మంగళవారం రాత్రి ఆయన ఢిల్లీకి వెళ్లారు. ముఖ్యమంత్రి హోదాలో రేవంత్రెడ్డికి ఇది 75వ హస్తిన పర్యటన కావడం గమనార్హం. అంటే 2023 డిసెంబర్లో అధికారం చేపట్టినప్పటి నుంచి సగటున ప్రతి 13 రోజులకు ఒకసారి ఢిల్లీకి ప్రదక్షిణలు చేసినట్టు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. తాజా వజ్రోత్సవ పర్యటన నేపథ్యంలో ప్రజల్లో, రాజకీయ వర్గాల్లో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే అప్పులు తేవడంలో, పథకాలను ఎగ్గొట్టడంలో తనకు తానే సాటి అని నిరూపించుకున్న ముఖ్యమంత్రి.. తాజాగా మరో రికార్డును అందుకొన్నారంటూ ఎద్దేవా చేస్తున్నారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ స్థాయిలో దేశ రాజధానికి వెళ్లడం ఎప్పుడూ చూడలేదని పేర్కొంటున్నారు.
సీఎం రేవంత్రెడ్డి మెజారిటీ ఢిల్లీ పర్యటనలను ‘కేంద్ర ప్రభుత్వంతో చర్చలు’ పేరుతో కవర్ చేసేందుకు సీఎంవో ప్రయత్నించింది. వాస్తవానికి కాంగ్రెస్ అగ్రనాయకత్వంతో తనకు ఏర్పడిన దూరాన్ని తగ్గించుకొనే క్రమంలోనే రేవంత్రెడ్డి అనేకసార్లు ఢిల్లీకి వెళ్లారనేది సుస్పష్టం. అవసరం లేకున్నా రోజులపాటు అక్కడే తిష్టవేయడం ఇందుకు నిదర్శనమని విశ్లేషకులు చెప్తున్నారు. కానీ, కేంద్ర మంత్రులతో సమావేశాలు, రాష్ర్టానికి నిధులు, ప్రాజెక్టులకు అనుమతులు, పెట్టుబడుల కోసమే సీఎం వెళ్లారంటూ ముఖ్యమంత్రి కార్యాలయం ప్రకటనలు ఇచ్చింది. దీనికి తగ్గట్టే సీఎం సైతం కేంద్ర మంత్రులకు వినతిపత్రాలు ఇచ్చి వస్తున్నారు.
ఆ పర్యటనల వల్ల రాష్ర్టానికి వచ్చిందేంటో చెప్పాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి. ‘ఎక్కే ఫైట్, దిగే ఫ్లైట్’ అన్నట్టుగా రెండువారాలకు ఒకసారి ఢిల్లీ టూర్లు చేస్తున్నారే తప్ప.. ఇప్పటివరకు కేంద్రం నుంచి ఒక్క ప్రాజెక్టుకు కూడా అనుమతి తీసుకురాలేకపోయారని కాంగ్రెస్ నేతలే విమర్శిస్తున్నారు. సీఎం ఢిల్లీ పర్యటనలతో తెలంగాణకు కేంద్రం నుంచి ఎంతమేర నిధులొచ్చాయి? ఎన్ని పెండింగ్ ప్రాజెక్టులకు అనుమతులు లభించాయి? పర్యటనల కోసం అయిన ఖర్చెంత? రాష్ట్ర ప్రజలకు కలిగిన ప్రయోజనమేంది? వంటి అంశాలపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.