(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, ఆగస్టు 4 (నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్న కేరళలో ఆ రాష్ట్ర రవాణాశాఖ మంత్రి, కమ్యూనిస్ట్ మార్క్సిస్ట్ పార్టీ (సీఎంపీ) ప్రధాన కార్యదర్శి సీపీ జాన్ మహిళలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘ప్రియదర్శిని’ స్కీమ్ పేరిట సర్కార్ అమలు చేస్తున్న ఉచిత బస్సుల్లో ఎక్కడానికి మహిళలు ఎగబడతారని జాన్ అన్నారు. ఇదే మహిళలు భర్త లేదా తండ్రి జబ్బుపడితే ప్రభుత్వ దవాఖానకు కూడా క్యూకడుతారని పేర్కొన్నారు. అయితే, వాళ్ల పిల్లలను మాత్రం వేలకు వేలు చెల్లించి ప్రైవేట్ స్కూల్స్కు పంపిస్తారని మహిళల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బస్సు ప్రయాణాలకు, హాస్పిటల్ చికిత్సకు చేతుల్లో డబ్బులు ఉండవుగానీ, ప్రైవేట్ స్కూల్స్లో ఫీజుల చెల్లింపునకు మాత్రం ఇలాంటి మహిళలకు డబ్బులు వస్తాయంటూ ఎద్దేవా చేశారు.
జాన్ వ్యాఖ్యలపై విపక్షాలతో పాటు ఆలిండియా డెమొక్రటిక్ విమెన్స్ అసోసియేషన్ (ఐద్వా) నేతలు భగ్గుమన్నారు. ఇది ముమ్మాటికీ మహిళలను కించపరచడమేనని మండిపడ్డారు. జాన్ తన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకొని, మహిళలకు క్షమాపణలు తెలియజేయాలని డిమాండ్ చేశారు. అయితే, తాను ఎవరినీ అవమానించలేదని జాన్ అన్నారు. తమలాంటి పేదరికంలో ఉండొద్దన్న ఉద్దేశంతోనే మహిళలు తమ పిల్లలను ప్రైవేట్ స్కూల్స్కు పంపిస్తున్నారని తాను అన్నానని జాన్ చెప్పుకొచ్చారు.