న్యూశాయంపేట, ఏప్రిల్ 2 : అధికారుల తీరుమారదు.. చెత్త సమస్యకు పరిష్కారం కాదు. చెరువులు కాలుష్య కాసారాలుగా మారుతున్నా పట్టించుకునే పరిస్థితి లేదు. చెరువులు చెత్త డంపింగ్ యార్డులుగా మారుతున్నాయి. వరంగల్ గ్రేటర్ పరిధి డివిజన్లలో ఎక్కడ చూసినా చెత్తరోడ్లపై పేరుకుపోతున్న దృశ్యాలు దర్శనమిస్తున్నాయి. అధికారులు ప్రకటనలకు పరిమితం అయ్యారు. పారిశుధ్యం పడకేసినా పట్టించుకునే పరిస్థితి లేదు. పారిశుధ్యం లోపభూయిష్టంగా మారిందని ప్రజలు చెప్తున్నా అధికారులకు చీమ కుట్టినట్లు లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఎక్కడచూసినా చెత్త పేరుక పోవడంతో దోమలకు, ఈగలకు, పందులకు, వీధి కుక్కలకు నిలయాలుగా మారాయి.
ఫిర్యాదులు చేసినా ఫలితం లేదు..
కనీసం దోమల నియంత్రణకు ఫాగింగ్ చేయడం లేదని కాలనీ వాసులు ఆరోపిస్తున్నారు. దోమల బెడదతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. దోమలు కుట్టీ చాల మంది దవాఖానాల పాలైన సందర్భాలు కోకల్లలుగా ఉన్నాయి. చెత్త సమస్యకు అధికారులు ఇప్పట్లో చెక్ పెట్టేటట్లు లేదని స్థానికులు వాపోతున్నారు. అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా పట్టించుకోవడం లేదని స్థానికులు పేర్కొంటున్నారు. కమిషనర్, ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధుల పర్యటన ఉన్న రోజు మాత్రమే అధికారులు కన్పిస్తారు తప్ప మిగతా రోజులు కన్పించరనే ఆరోపణలు వస్తున్నాయి.
గుర్రపు డెక్కను తొలగించని వైనం..
గ్రేటర్ పరిధిలోని కోట చెరవు, 49వ డివిజన్లో బంధం చెరువులలో గుర్రపు డెక్క, పిచ్చి మొక్కలతో చెరువులను ఆవరించింది. చెరువును చూడగానే పార్కులా పచ్చగా కనిపిస్తోంది. దగ్గరకు పోయి చూస్తే మాత్రం దుర్గంధ వాసన వెదజల్లుతోందని స్థానికులు వాపోతున్నారు. పరిసర ప్రాంతాల నుంచి చెత్తను తీసుకొచ్చి చెరువులలో పడేయడంతో చెరువులు డంపింగ్ యార్డులుగా మారుతున్నాయి.
గుర్రపు డెక్కను తొలగించాలని పలుమార్లు అధికారులతో సమీక్షా సమావేశాలు పెట్టి చెరువులలో ఉన్న గుర్రపుడెక్కను, అనవసరపు మొక్కలను తొలగించాలని ఆదేశాలు ఇచ్చారు. చెరువులను అభివృద్ధి చేయడానికి అధికారులను మందలించిన సందర్భాలు ఉన్నాయి. అయినా అధికారులలో మాత్రం చలనం లేదన్న అరోపణలు వెల్లువెత్తుతున్నాయి.