పూల ముగ్గులు, లతల ముగ్గులు.. ప్రకృతిని తలపిస్తాయి. నెమలి ముగ్గులు, జింక ముగ్గులు.. వన్య మృగాలను గుర్తుచేస్తాయి. తోరణాల ముగ్గులు, చెరుకుగడల ముగ్గులు.. పండుగను స్వాగతిస్తాయి. కానీ, పెద్ది కుసుమ వేసే ప్రత్యేక ముగ్గులు తెలంగాణ సర్కారు సంక్షేమ పథకాలనూ ప్రతిబింబిస్తాయి.
రైతుబంధు డబ్బులొస్తే అన్నదాతలకు పండుగే. అప్పుల కోసం బ్యాంకుల చుట్టూ తిరగాల్సిన పన్లేదు. వడ్డీ వ్యాపారులను బతిమాలాల్సిన అవసరం లేదు. ఖాతాలో డబ్బు. గుండెల్లో భరోసా. కండ్లలో వెలుగు. ఆ పంచరంగులను ముచ్చటైన ముగ్గులో ఇమడ్చాలని భావించారు జనగామకు చెందిన పెద్ది కుసుమ. మూడు గంటలు శ్రమించి రంగోలి రూపంలో ముఖ్యమంత్రి కేసీఆర్కు కృతజ్ఞతలు చెప్పారు. ఆ మరుసటి రోజు రైతులతో జరిగిన ఓ సమావేశంలో స్థానిక ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి కుసుమను ఘనంగా సన్మానించారు. చీరె సారె పెట్టారు. మరుక్షణం నుంచీ ఆమె ‘రైతుబంధు కుసుమ’గా మారారు.
సమాజాన్ని పట్టి పీడిస్తున్న సమస్యలపై తన వంతుగా ముగ్గుల ద్వారా అవగాహన కల్పిస్తారు కుసుమ. స్త్రీల హక్కులు, సమానత్వం, సర్వమత సామరస్యం, కరోనా జాగ్రత్తలు.. ఇలా ప్రతి అంశమూ ఆమె ముంగిట ముగ్గు అవుతుంది. ముగ్గు గిన్నె కుసుమ చేతి ఆయుధం. కళ్లాపి చల్లిన నేలంతా ఆమె క్యాన్వాసే. సాధారణంగా ముగ్గులో ప్రతి చుక్కనూ కలుపుతూ పోతే పువ్వు, లత, కలశం, నెమలి.. ఇలా ఏదో ఓ ఆకృతి రూపుదాలుస్తుంది. కానీ, కుసుమ కలిపే చుక్కలు.. అన్యాయాన్ని ప్రశ్నిస్తాయి, వివక్షను నిలువరిస్తాయి, అఘాయిత్యాలపై కండ్లెర్రజేస్తాయి. అవే చుక్కలు.. ప్రజాహిత పాలనపట్ల ప్రశంసలు కురిపిస్తాయి. రైతుబంధులాంటి సంక్షేమ పథకాలకు జేజేలు కొడతాయి. మూడేండ్లలో వివిధ సమస్యలపై 800కు పైగా ముగ్గులను ఆవిష్కరించారు కుసుమ.
కుసుమ పుట్టి పెరిగింది హనుమకొండలో. పెండ్లి తర్వాత భర్త నాగరాజుతో కలిసి జనగామలో స్థిరపడ్డారు. ఈ దంపతులు స్వశక్తితో నిలదొక్కుకుని జనగామ సెంటర్లో శానిటరీ దుకాణం ప్రారంభించారు. బాల్యం నుంచీ కుసుమకు ముగ్గులంటే మమకారం. ముంగిలినే ప్రయోగ
శాలగా మార్చుకొని అనేక ఆవిష్కరణలు చేశారు. తన ముగ్గులను నింపడానికి కుసుమ సహజసిద్ధమైన రంగులనే ఎంచుకుంటారు. పరిస్థితుల కారణంగా ఇంటర్ వరకే చదువుకున్నా, ఆమెకు సమాజం పట్ల అవగాహన ఎక్కువే. తను వేసిన ముగ్గులను ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ఖాతాల్లోనూ పోస్టు చేస్తుంటారు.
తెలంగాణ ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఇతివృత్తంగా కుసుమ వేసిన ముగ్గులకు రాష్ట్ర
స్థాయిలో గుర్తింపు వచ్చింది. సంక్రాంతికి వివిధ సంస్థలు, పత్రికలు నిర్వహించే రాష్ట్రస్థాయి ముగ్గుల పోటీల్లో కుసుమ ప్రాతినిధ్యం తప్పక ఉంటుంది. మొదటి మూడు స్థానాల్లో ఏదో ఒకటి దక్కాల్సిందే. ఆన్లైన్ బహుమతులకైతే లెక్కేలేదు. సామాజిక అంశాలపై తనదైన రీతిలో స్పందిస్తూ.. సావిత్రీబాయి పూలే జాతీయ విశిష్ట సేవా పురస్కారం, గుర్రం జాషువా జాతీయ కళారత్న పురస్కారం తదితర అవార్డులు అందుకున్నారు పెద్ది కుసుమ.
బంగారు తెలంగాణ కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారు. వాటి గురించి ప్రజలు గొప్పగా చెప్పుకొంటున్నారు. ప్రతి గడపకూ ప్రభుత్వ ఫలాలు అందుతున్నాయి. ఆ స్పందనకు నేను ఓ ముగ్గు రూపం ఇచ్చాను. అది నాకు రాష్ట్రవ్యాప్తంగా గుర్తింపును తీసుకొచ్చింది. అప్పటి నుంచి అంతా ‘రైతుబంధు కుసుమ’ అంటున్నారు. ఇన్నాళ్లూ ముగ్గుల పోటీలలో పాల్గొనమని పిలిచేవారు. ఇప్పుడు న్యాయనిర్ణేతగా ఆహ్వానిస్తున్నారు. ఈ గుర్తింపును నేను మర్చిపోలేను.
‘నమస్తే తెలంగాణ’ దిన పత్రికకు ప్రత్యేక కృతజ్ఞతలు.
– పెద్ది కుసుమ
…✍ డప్పు రవి
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఆస్ట్రేలియా స్థానిక ఎన్నికల్లో గెలిచిన తెలంగాణ ఆడబిడ్డ.. ఆమె విజయ రహస్యమిదే..
gauthami jeji | బొల్లి మచ్చలు ఉన్నాయని కుంగిపోలేదు.. మోడలింగ్లో అదరగొడుతుంది..
Keerthi priya | రైతన్నలకు అండగా సూర్యాపేట యువతి.. ఇంతకీ ఆమె ఏం చేస్తోందంటే..
nalli fashions | తాతల నుంచి చేస్తున్న చీరల వ్యాపారానికి ఈమె బ్రాండ్ క్రియేట్ చేసింది
Vijayalakshmi | చదివింది పదో తరగతే కానీ.. చేసేది కోట్ల బిజినెస్
Gray hair | చిన్నవయసులోనే తల నెరిసిన వారికి ఈమె ఓ ఇన్స్పిరేషన్.. ఎందుకంటే?