బీబీనగర్: గుజరాత్ రాష్ట్రంలోని గాందీనగర్కు చెందిన నేషనల్ ఫోరెన్సిక్ సైన్సెస్ యూనివర్సిటీతో కలసి బీబీనగర్ ఎయిమ్స్ అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్టు ఎయిమ్స్ డైరెక్టర్ వికాస్ భాటియా తెలిపారు. ఈ ఒప్పందం ద్వారా విద్యార్థులు, అధ్యాపకుల మార్పిడి, ఉమ్మడి పరిశోధన కార్యకలాపాలు, ఉమ్మడి డిగ్రీ కార్య క్రమాలను ప్రారంభిం చడం, ఫోరెన్సిక్ సైన్స్, ఆంత్రోపాలజీ, ఓడోంటాలజీ, టాక్సికాలజీ లేబోరేటరీలను స్థాపించడానికి పరస్పర ప్రయోజనకర మైన సహకారాలను ఏర్పాటు చేస్తుందన్నారు.
ఈ అవగాహన ఒప్పందాన్ని వర్చువల్ విధానం ద్వారా నిర్వహించి ఒప్పంద పత్రంపై డైరెక్టర్ వికాస్ భాటియా, డాక్టర్ అబ్రహం జాన్సన్, డాక్టర్ ప్రగ్నేశ్ పర్మార్ సంతకం చేశారు. ఈ సందర్భంగా డైరెక్టర్ వికాస్ భాటియా మాట్లాడుతూ కొత్త కోర్సులను అభివృద్ధి చేయడంలో, కొత్త ఆవిష్కరణలు తీసుకురావడానికి ఉప యోగపడుతుందన్నారు. కార్యక్రమంలో డీన్ డాక్టర్ రాహుల్ నరాంగ్, డాక్టర్ యుడుకుల్, డాక్టర్ ప్రశాంత్, డాక్టర్ దివ్యా రెడ్డి, పీఆర్వో శ్యామల పాల్గొన్నారు.