యాదాద్రి : విద్యార్థుల కళాశాలకు వెళ్లడంతో పాటు తిరిగి ఇంటికి చేరుకునే సమయానికి ఆర్టీసీ బస్సులను పునరుద్దరించినట్లు ప్రభుత్వ విప్ గొంగిడి సునితామహేందర్రెడ్డి తెలిపారు. గురువారం యాదగిరిగుట్ట పట్టణంలోని తన నివాసంలో యాదగిరిగుట్ట ఆర్టీసీ డిపో మేనేజర్ లక్ష్మారెడ్డి, సూపర్వైజర్ ఎల్లయ్యతో సమావేశం నిర్వహించి, ఆర్టీసీ బస్సులను పునరుద్ధరించాలని ఆదేశించారు. గుండాల నుంచి బండకొత్తపల్లి వరకు వయా మోడల్ స్కూల్ మీదుగా, యాదగిరిగుట్ట నుంచి సీతారాంపురం, ఆలేరు నుంచి దూదివెంకటాపురం, నేమిలే గ్రామాల మీదుగా రాజాపేట, ఆలేరు నుంచి టంగుటూరు, సాయిగూడెం మీదుగా తూర్పుగూడెం, చిన్న లక్ష్మాపురం వయా ధర్మారం, పల్లెపహాడ్, మోడల్ స్కూల్ మీదుగా భువనగిరి, భువనగిరి నుంచి వయా చందేపల్లి, చాడ గ్రామాల మీదుగా తేర్యాల గ్రామం, చాడ నుంచి వయా నాంచారిపేట, కదిరేణిగూడెం మీదుగా వలిగొండ మండల కేంద్రానికి బస్సులను పునరుద్దరించినట్లు తెలిపారు. విద్యార్థుల చదువులకు ఎలాంటి అసౌకర్యం కల్పించవద్దని ఈ సందర్భంగా డిపో అధికారులకు సూచించారు.