హైదరాబాద్ : కేంద్రంలో బీజేపీ పొరపాటున మళ్లీ అధికారంలోకి వస్తే రాజ్యాంగానికి మనుగడ ఉండదని, ప్రజల ఓటు హక్కును కూడా లాగేసుకుంటారని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె. నారాయణ (CPI Narayana) ఆరోపించారు. మోదీ ప్రభుత్వ విద్వేషపూరిత, ప్రజా వ్యతరేక విధానాల వల్ల దేశ ప్రజల జీవన పరిస్థితులు అధ్వాన్నంగా మారాయని ఆందోళన వ్యక్తం చేశారు. మఖ్డూమ్ భవన్ లో శనివారం సీపీఐ (CPI) సికింద్రాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గం సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడారు.
నరేంద్ర మోదీ(Narendra Modi) ప్రభుత్వం 10 ఏళ్లలో 26 కోట్ల మందిని దారిద్య్రరేఖకు దిగువకు నెట్టిందని ఆరోపించారు. విభజించు, పాలించు ప్రణాళికతో ప్రధాని ఎన్నికల ప్రసంగాలలో విద్వేషపూరిత ప్రసంగాలు చేస్తున్నారని మండిపడ్డారు. సామరస్యంగా ఉన్న దేశ ప్రజల మధ్య అగ్గిరాజేసి అధికారంలోకి రావడానికి ప్రయత్నిస్తున్నాడని విమర్శించారు. కాంగ్రెస్(Congress) పార్టీ కేంద్రంలో అధికారంలోకి వస్తే మైనారిటీలు మహిళల మంగళ సూత్రాలు లాగేసుకుంటారని దిగజారుడు వ్యాఖ్యలు చేస్తున్నాడని పేర్కొన్నారు.
ఇల్లు సంసారం లేని మోదీ కి మంగళ సూత్రాల విలువ ఏమి తెలుసునని దుయ్యబట్టారు. నిరుద్యోగం, నిత్యావసర వస్తువుల ధరలు, డీజిల్(Diesel), పెట్రోల్, వంటగ్యాస్ సిలిండర్ ధరలు అడ్డుఅదుపులేకుండా పెరగడం వల్ల సామాన్య ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఆర్ఎస్ఎస్ (RSS) ఎజెండా ను అమలు చేయడానికి బీజేపీ రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తుందని ఆరోపించారు. ఇండియా కూటమికి చెందిన అభ్యర్థులను గెలిపించుకొని రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని, లౌకికవాదాన్ని రక్షించుకోవాలని అయన కోరారు. సీపీఐ నాయకులు నరసింహ, ఎస్. ఛాయాదేవి హైదరాబాద్ జిల్లా సహాయ కార్యదర్శులు కమతం యాదగిరి, బి. స్టాలిన్ తదితరులు పాల్గొన్నారు.