ఇంఫాల్: సాయుధులైన ఐదుగురు వ్యక్తులు పట్టపగలు బ్యాంకు దోపిడీకి (bank robbery) పాల్పడ్డారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) బ్రాంచ్లో రూ.20 లక్షలు లూఠీ చేశారు. దీంతో సీసీటీవీ ఫుటేజ్ ద్వారా నిందితులను గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. జాతుల మధ్య పోరాటంతో అట్టుడుగుతున్న మణిపూర్లో ఈ సంఘటన జరిగింది. గురువారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో చురచంద్పూర్ జిల్లాలోని కే సాల్బంగ్ ఎస్బీఐ బ్రాంచ్లోకి ఐదుగురు వ్యక్తులు చొరబడ్డారు. సాయుధులైన ఆ వ్యక్తులు ముఖాలకు మాస్కులు ధరించారు. ఆయుధాలతో బ్యాంకు సిబ్బందిని బెదిరించి సుమారు రూ.20 లక్షలు దోచుకున్నారు. అనంతరం అక్కడి నుంచి పారిపోయారు.
కాగా, బ్యాంకు దోపిడీ గురించి తెలుసుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. బ్యాంకులోని సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలించారు. నిందితులను గుర్తించి వారిని అరెస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. నిందితుల కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు పోలీస్ అధికారి తెలిపారు.