Kiran Abbavaram | యంగ్ హీరో కిరణ్ అబ్బవరం ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకెళ్తున్నారు. ఇటీవల ఆయన నటించిన ‘చెన్నై లవ్ స్టోరీ’ ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి రెస్పాన్స్ అందుకోవడంతో పాటు బాక్సాఫీస్ వద్ద కూడా సత్తా చాటుతోంది. ఈ సక్సెస్ను ఎంజాయ్ చేస్తున్న కిరణ్.. మరోవైపు భారీ స్థాయిలో తెరకెక్కనున్న పాన్ ఇండియా ప్రాజెక్ట్కు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే కిరణ్ అబ్బవరం ప్రముఖ నిర్మాత ప్రేరణ అరోరా, జీ స్టూడియోస్ భాగస్వామ్యంతో ఓ భారీ బడ్జెట్ మైథలాజికల్ సినిమాలో నటించబోతున్నట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ ప్రాజెక్ట్కు సంబంధించిన కీలక వివరాలను మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.
ఈ ప్రతిష్ఠాత్మక చిత్రానికి ‘ఇంద్రపుత్ర’ అనే టైటిల్ను ఖరారు చేశారు. టైటిల్ను అధికారికంగా ప్రకటిస్తూ చిత్ర బృందం ఆసక్తిని పెంచింది. పేరు చూస్తేనే ఇది పురాణ, ఇతిహాస నేపథ్యంతో రూపొందనున్న భారీ చిత్రమనే విషయం స్పష్టమవుతోంది. ఈ సినిమాతో శ్రీకాంత్ పుప్పాల దర్శకుడిగా పరిచయం కానున్నారు. ఆయన గతంలో ‘కాంతార చాప్టర్ 1’ చిత్రానికి ఫస్ట్ అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశారు. ఆ అనుభవాన్ని ఇప్పుడు తన తొలి దర్శకత్వ చిత్రానికి ఉపయోగించుకోనున్నారు. భారీ విజువల్స్, పురాణ నేపథ్యం, విభిన్నమైన కథాంశంతో ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో రూపొందించేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.
‘ఇంద్రపుత్ర’ రెగ్యులర్ షూటింగ్ను అక్టోబర్లో ప్రారంభించనున్నట్లు చిత్ర బృందం వెల్లడించింది. భారీ బడ్జెట్తో తెరకెక్కనున్న ఈ ప్రాజెక్ట్ను పలు భాషల్లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.ఈ సినిమా కేవలం ఒక కథతో ముగిసిపోయే ప్రాజెక్ట్ కాదని తెలుస్తోంది. మేకర్స్ రూపొందించనున్న మైథలాజికల్ యూనివర్స్లో ‘ఇంద్రపుత్ర’ మొదటి అధ్యాయంగా ఉండబోతున్నట్లు సమాచారం. దీంతో ఈ సినిమా తర్వాత ఇదే ప్రపంచంలో మరిన్ని కథలు, పాత్రలతో సినిమాలు తెరకెక్కించే అవకాశం ఉంది. ఈ చిత్రాన్ని ప్రేరణ అరోరా, జీ స్టూడియోస్తో కలిసి నిర్మాణ బృందం భారీ స్థాయిలో రూపొందిస్తోంది. కీర్తన్ సహ నిర్మాతగా వ్యవహరించనున్నారు. ప్రస్తుతం కథ, ప్రీ-ప్రొడక్షన్ పనులను పూర్తి చేసే దిశగా చిత్ర బృందం ముందుకు సాగుతోంది. మరోవైపు సినిమాలో కిరణ్ అబ్బవరం పాత్ర ఎలా ఉండబోతోంది? ఆయన సరసన నటించబోయే హీరోయిన్ ఎవరు? ఇతర కీలక పాత్రల్లో ఎవరెవరు కనిపించనున్నారు? వంటి విషయాలపై ఆసక్తి నెలకొంది. నటీనటులు, సాంకేతిక నిపుణులు, కథకు సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని మేకర్స్ తెలిపారు.