హైదరాబాద్, సెప్టెంబర్ 15 (నమస్తే తెలంగాణ) : వానకాలం ముగింపు దశకు చేరుకొన్నది. ఈ నెల 17 నుంచి వాయవ్య రాజస్థాన్ ప్రాంతం నుంచి నైరుతి రుతుపవనాల నిష్రమణ ప్రక్రియ ప్రారంభం కాను న్నదని కేంద్ర వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ ప్రక్రియ అక్టోబర్ 15 నాటికి ముగుస్తుందని పేర్కొన్నది. ఆ తర్వాత దక్షిణ భారతదేశంలో ఈశాన్య రుతుపవనాల రాక మొదలవుతుంది.
ఈ ఏడాది జూన్ 1నుంచి సెప్టెంబ ర్ 14వరకు దేశవ్యాప్తంగా సగటు వర్షపాతం 14శాతానికిపైగా లోటు నమోదైంది. వానకాలం చివరి నాటికి వర్షపాతం లో లోటు 10శాతం కంటే ఎకువగానే ఉం డనున్నది. దీంతో దేశంలో కరువు పరిస్థితులు దాపురించే ముప్పు ఉన్నదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇది రాబోయే రోజుల్లో తాగునీటి నిల్వలు, జలవిద్యుదుత్పత్తిపై ప్రభావం చూపే అవకాశం ఉన్నదని పేర్కొంటున్నారు.
బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కారణంగా రాగల రెండు రోజుల్లో రాష్ట్రంలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశమున్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.