దుగ్గొండి, సెప్టెంబర్ 15 : ఓ వైపు వర్షాలు లేక.. మరోవైపు కాళేశ్వరం నీళ్లు రాక తన పంట ఎండిపోయిందని ఓ మహిళా రైతు ఆందోళన వ్యక్తంచేసింది. కాంగ్రెస్ సర్కార్ తీరుతోనే పంటను కోల్పోవాల్సి వచ్చిందని వాపోయింది. కాలువకు నీళ్లొచ్చినా పంట గట్టెక్కేదని పేర్కొంది. సీఎం రేవంత్రెడ్డి వెంటనే స్పందించి తనను ఆదుకోవాలని పొలంలో ఫ్లెక్సీ ఏర్పాటు చేసి నిరసన తెలిపింది వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం వెంకటాపురానికి చెందిన మహిళా రైతు కక్కెర్ల లక్ష్మి. వివరాలు ఇలా.. గ్రామానికి చెందిన రైతు లక్ష్మి తనకున్న 2 ఎకరాల 30 గుంటల భూమిలో పత్తి సాగు చేసింది.
సకాలంలో వర్షాలు కురువకపోగా.. పక్కనే ఉన్న కాలువకు నీరు విడుదల చేయకపోవడంతో తన పంట ఎండిపోయిందని పొలంలో ఫ్లెక్సీ ఏర్పాటు చేసి ఆవేదన వ్యక్తం చేసింది. సాగు కోసం బ్యాంకుతోపాటు ప్రైవేట్ అప్పులు తీసుకున్నానని, ఇప్పుడు వాటిని కట్టే పరిస్థితి లేదని వాపోయింది. తమ భూముల పక్కనే కాకతీయ 38 డీబీఎం కాలువ ఉన్నదని, ప్రభుత్వం కాళేశ్వర జలాలను తరలించి ఉంటే చెరువులోకి నీళ్లు వచ్చేవని, తద్వారా బావుల్లో నీరు పెరిగి తమ పంటలను కాపాడుకునే వాళ్లమని తెలిపింది. ప్రభుత్వం ముందు చూపుతో వ్యవహరించి ఉంటే తమ పంటలు ఇలా ఎండిపోయేవి కావని ఆవేదన వ్యక్తంచేసింది. రాష్ట్రంలో కరువు పరిస్థితులు ఏర్పడటంతో పంటలు నష్టపోయిన రైతులను ఆదుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిని వేడుకున్నది.