భువనగిరి అర్బన్, ఆగస్టు2: బస్వాపూర్ రిజర్వాయర్లో ముంపునకు గురైన రైతులకు పరిహారాన్ని చెల్లించాలని జాతీయ బీసీ కమిషన్ సభ్యుడు తల్లోజు ఆచారి అన్నారు. సోమవారం ఆయన బస్వాపూర్ రిజర్వాయర్లో ముంపునకు గురైన బీఎన్తిమ్మాపురం గ్రామాన్ని పరిశీలించారు. గ్రామస్తులతో సమావేశమై భూనిర్వాసితుల సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్లో అదనపు కలెక్టర్ దీపక్తివారీ, ఇంచార్జి ఆర్డీవో సూరజ్కుమార్, ఇరిగేషన్ తదితర శాఖల అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలో భూనిర్వాసితులకు పరిహారం చెల్లించే పనులను త్వరగా చేపట్టాలన్నారు. గ్రామంలో కొత్తగా ఇండ్లు నిర్మించుకున్న వారికి తాగునీరు, విద్యుత్, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు. భూవివాదాలు ఉంటే స్వయంగా మాట్లాడి చర్చలతో పరిష్కరించాలన్నారు. గ్రామంలో చనిపోయిన 30 మందికి సంబంధించి ఫౌతీ వెంటనే చేపట్టాలని, జా ప్యం కారణంగా ఆ కుటుంబాల సభ్యులు రైతుబంధు, రైతుబీమా కోల్పోతున్నారని అన్నారు. ఒకే గ్రామంలో వేర్వేరుగా నష్టపరిహారాన్ని ఎలా చెల్లిస్తారని అధికారులను ఆయన ప్రశ్నించారు. త్వరలో ఢిల్లోలో జరగనున్న సమావేశానికి హాజరుకావాలని అధికారులకు సూచించారు. భూములు తీసుకున్న మూడు నెలల్లోనే పరిహారాన్ని చెల్లించాలన్నారు. భూనిర్వాసితులకు అన్ని వసతులతో ఇండ్లు నిర్మించి ఇవ్వాలని, నిబంధనల పేరుతో వారిని ఇబ్బందులకు గురిచేయొద్దన్నారు. అనంతరం ఆయన బస్వాపూర్ ప్రాజెక్టు నిర్మిస్తున్న ప్రాంతాన్ని పరిశీలించారు.
బీసీ కమిషన్ సభ్యుడికి వినతి
గ్రామంలో భూములు కోల్పోయిన రైతులకు పరిహారంతోపాటు, వడపర్తి సమీపంలోని ప్రధాన రహదారి పక్కన ఉన్న ప్రభుత్వ భూమిలో వారికి ఇండ్లు నిర్మించి ఇచ్చేలా చూడాలని భువనగిరి పీఏసీఎస్ మాజీ చైర్మన్ ఎడ్ల సత్తిరెడ్డి జాతీయ బీసీ కమిషన్ సభ్యుడు ఆచారికి విజ్ఞప్తి చేశా రు. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ దీపక్తివారీ, ఇంచార్జి ఆర్డీవో సూరజ్కుమార్, ఎంపీటీసీ ఉడుత శారదాఆంజనేయులు, సర్పంచ్ పిన్నం లత, నారాయణరెడ్డి, పీవీ శ్యామ్సుందర్ తదితరులు పాల్గొన్నారు.