యాదాద్రి భువనగిరి, మే 8 (నమస్తే తెలంగాణ) ; జిల్లాలో ఈదురుగాలులతో కూడిన అకాల వర్షంతో ధాన్యం తడిసి ముద్దయ్యింది. అన్నదాత ఆరుగాలం కష్టించి పండించిన పంట నేలపాలైంది. కొనుగోళ్లలో నిర్లక్ష్యం, లారీలు, గన్నీ బ్యాగుల కొరతతో ధాన్యం తడిసింది. ఇప్పటికే కరువుతో సగం పంట ఎండిపోగా.. సర్కారు నిర్లక్ష్యంతో రైతన్న ఇంకింత నష్టపోవాల్సి వచ్చింది. ప్రభుత్వం వెంటనే ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
వరి కోతలు చివరి దశకు రావడంతో పంటలు చేతికొస్తున్నాయి. జిల్లాలో యాసంగి సీజన్కు సంబంధించి 323 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి అధికారులు మంగళవారం వరకు 75వేల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు తెలిపారు. కాగా, కొనుగోలు కేంద్రాల వద్ద సరైన సదుపాయాలు కల్పించడం లేదని రైతులు వాపోతున్నారు. సరిపడా టార్పాలిన్లు, గన్నీ బ్యాగులు లేవని రైతులు చెప్తున్నారు. జిల్లావ్యాప్తంగా మంగళవారం రాత్రి ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది. ముఖ్యంగా భువనగిరి, బొమ్మలరామారం, వలిగొండ, బీబీనగర్, రామన్నపేట, భూదాన్పోచంపల్లి, చౌటుప్పల్, మోటకొండూరు, ఆలేరు, గుండాల, మోత్కూరు, అడ్డగూడూరు, యాదగిరిగుట్ట మండలాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. దాంతో వేల బస్తాల ధాన్యం తడిసిపోయింది. ఒక్కసారిగా పెద్ద ఎత్తున గాలి దుమారం రావడంతో ధాన్యం రాశులపై కప్పిన టార్పాలిన్ కవర్లు కొట్టుకుపోయాయి.
ఐదురోజులైనా కొంటలేరు..
ప్రభుత్వ నిర్లక్ష్యంతో రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. కరెంట్ కోతలు, సాగునీరు లేక ఇప్పటికే కరువు తాండవించడంతో సగం పంటలు ఎండిపోయాయి. మిగిలిన పంటను అష్టకష్టాలు పడి కాపాడుకుని కొనుగోలు కేంద్రాలకు తీసుకొస్తే వివిధ కారణాలు చెప్తూ నాలుగైదు రోజులైనా కొంటలేరు. దాంతో కల్లాల్లో ధాన్యం రాశులు నిలిచిపోతున్నాయి. మరోవైపు కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్లకు నిర్వాహలకు కొర్రీలు పెడుతున్నారు. నాణ్యమైన ధాన్యాన్ని ఏ గ్రేడ్, ఆ తర్వాత ధాన్యాన్ని బీ-గ్రేడ్కు కొంటారు. నాణ్యమైన ధాన్యం తీసుకొచ్చినా తేమ, తాలు, క్వాలిటీ లేదంటూ తక్కువకు కొంటున్నట్లు రైతులు వాపోతున్నారు.
లారీల కొరత.. తడుస్తున్న వడ్లు
కొనుగోలు కేంద్రాల్లో అరకొరగా ధాన్యం కొంటున్నా రవాణాలో ఆగిపోతున్నది. రోజులు గడుస్తున్నా ధాన్యం బస్తాలు అక్కడే ఉంటున్నాయి. కొన్న వడ్లు రవాణా చేస్తేనే ఆ తర్వాత వచ్చిన ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు అవకాశం ఉంటుందని రైతులు చెప్తున్నారు. పాత ధాన్యం ట్రాన్స్పోర్ట్ చేయకపోవడంతో కొనుగోళ్లు కూడా సరిగ్గా ముందుకు సాగడం లేదు. లారీల కొరతే ఇందుకు కారణంగా చెప్తున్నారు. కొన్నిచోట్ల కావాలనే కృత్రిమ కొరత సృష్టిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. లారీలు ధాన్యాన్ని రవాణా చేయకపోవడంతో వర్షానికి వడ్లన్నీ తడిసిపోతున్నాయి. మరోవైపు ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలని రైతులు రోడ్డెక్కుతున్నా ప్రభుత్వంలో చలనం లేకపోవడం గమనార్హం.
ధాన్యం తెచ్చి నెల దాటినా తూకం వేయలే
చౌటుప్పల్ మార్కెట్లో వడ్లు పోసి నెల అయ్యింది. ఇప్పటికీ తూకం వేయలేదు. కొనడానికి సమయం పడుతుందని అధికారులు అన్నరు. మిల్లుల నుంచి లారీలు రావడం లేదని చెప్తున్నరు. హమాలీల కొరత కూడా ఉంది. మంగళవారం రాత్రి కురిసిన వానకు వడ్లన్నీ తడిసినయి. ఇప్పటికైనా వెంటనే ధాన్యం కొనుగోలు చేయాలి.
-సుర్కంటి మనోహర, శేరిల్ల, చౌటుప్పల్
ధాన్యం త్వరగా తరలించాలి
మా ధాన్యం కాంటా వేసి 4 రోజులు అయ్యింది. లారీల కొరతతో ధాన్యం బస్తాలు మిల్లుకు తరలించలేదు. మంగళవారం రాత్రి కురిసిన వర్షానికి గాలికి బస్తాలపై ఉన్న పట్టాలు ఎగిరిపోవడంతో110 బస్తాలు తడిసిపోయాయి. అధికారులు ధాన్యం తరలింపు చర్యలు చేపట్టి రైతులకు ఇబ్బంది లేకుండా చూడాలి.
-మర్రి గిరిప్రసాద్రెడ్డి, రైతు, రంగాపురం, బొమ్మలరామారం