హైదరాబాద్, ఆగస్టు 14 (నమస్తే తెలంగాణ): దేశంలో నిత్యావసర వస్తువుల ధరలు, ప్రజల జీవన వ్యయం నానాటికీ పెరుగుతున్నాయి. కానీ, మున్సిపల్ కార్మికుల శ్రమకు విలువ పెరుగడం లేదు. రాష్ట్రవ్యాప్తంగా పనిచేస్తున్న 30,945 మంది మున్సిపల్ ఔట్సోర్సింగ్ సిబ్బంది విలువ 2021 దగ్గరే ఆగిపోయింది. 2021 నాటి నంబర్ 60, 63 జీవో ల్లో ప్రతిపాదనలను అనుసరించి గత నెలలో జారీచేసిన జీవో 1181 ఇందుకు కారణమైంది. ఈ జీవో వల్ల వేతనాల్లో తమకు తీవ్ర అన్యాయం జరుగుతున్నదని మున్సిపల్ కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే ఆ జీవోను రద్దు చేయాలని, పెరిగిన జీవన వ్యయానికి అనుగుణంగా తమ వేతనాలను పెంచాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ శుక్రవారం భూపాలపల్లి మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు. ఈ ఆందోళనలు రాష్ట్రమంతటా విస్తరించే అవకాశాలున్నాయి. వివరాల్లోకి వెళ్తే.. రాష్ట్రంలోని మున్సిపాలిటీ ల్లో 30,945 మంది ఔట్సోర్సింగ్ సిబ్బంది సేవలను 2027 మార్చి 31 వరకు లేదా రెగ్యులర్ పోస్టులు భర్తీ అయ్యే వరకు, లేదా సేవల అవసరం ముగిసే వరకు కొనసాగించేందుకు జీవో 1181 ద్వారా ప్రభుత్వం అనుమతి ఇ చ్చింది.
ఫీల్డ్ అసిస్టెంట్లు, నాన్-పబ్లిక్ హెల్త్వర్కర్లకు రూ.15,600, డ్రైవర్లు, పబ్లిక్ హెల్త్వరర్లు, వర్ ఇన్స్పెక్టర్లకు 16,600, డాటా ఎంట్రీ ఆపరేటర్లకు రూ.19,500, ఎన్విరాన్మెంటల్ ఇంజినీర్లకు రూ.35 వేల చొప్పున చెల్లించాలని నెలవారీ వేతనం చెల్లించాలని ఆ జీవోలో పేర్కొన్నది. ఆరేండ్లలో అన్ని వస్తువు ల ధరలు భారీగా పెరిగిపోయాయని, అందు కు తగ్గట్టుగా వేతన సవరణ లేకపోవడం వల్ల తమ ఆదాయం తగ్గిపోతున్నదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ద్రవ్యోల్బణం పెరిగిపోతున్నప్పటికీ 2021లో నిర్ణయించిన వేతనాలనే ఇప్పుడూ కొనసాగించడం, ఆ వేతనాలను కూడా ఐఎఫ్ఎంఐఎస్-డీబీటీ ద్వారా కాకుం డా థర్డ్ పార్టీ ఏజెన్సీ ద్వారా చెల్లించాలని పేర్కొనడం ఏందని గగ్గోలు పెడుతున్నారు.