సూర్యాపేట, మే 8 : భారత రాజ్యాంగం మనకు కల్పించిన ఓటు హక్కును ప్రతి ఒక్కరూ నిర్భయంగా, ప్రలోభాలకు లొంగకుండా వినియోగించుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎస్. వెంకట్రావ్ పిలుపునిచ్చారు. స్వీప్ కార్యక్రమంలో భాగంగా బుధవారం సూర్యాపేటలోని ఎస్వీ ఇంజినీరింగ్ కళాశాల నుంచి కలెక్టరేట్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఎస్పీ రాహుల్ హేగ్డేతో కలిసి కలెక్టర్ ర్యాలీలో పాల్గొన్నారు.
అనంతరం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ ఓటు హక్కు ఉన్న యువత తప్పని సరిగా వినియోగించుకోవాలన్నారు. ఓటు అవశ్యకతను తెలుపాల్సిన బాధ్యత యువతపై ఉందని చెప్పారు. ఓటర్లను చైతన్యం చేయడానికి ఈ నెల 9న కోదాద, 10న హుజూర్నగర్, 11న తుంగతుర్తిలో బైక్ ర్యాలీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఎస్పీ రాహుల్ హేగ్డే మాట్లాడుతూ ఎన్నికల రోజును సెలవు దినం అనుకొని అశ్రద్ధ చేయొద్దని, ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించాలని అన్నారు. ఈ ర్యాలీలో పాల్గొన్న వివిధ శాఖలకు మెమెంటోలు అందించారు. మొదటి స్థానంలో విద్యా శాఖ, రెండో స్థానంలో డీఆర్డీఓ, మూడో స్థానంలో మెప్మా మున్సిపల్ శాఖ నిలిచాయి. ఈ కార్యక్రమంలో స్వీప్ అంబాసిడర్ దుశ్చర్ల సత్యనారాయమణ, స్వీప్ నోడల్ అధికారి, డీఈఓ అశోక్, ట్రైనీ ఐపీఎస్ రాజేశ్మీనా, ఏఎస్పీ నాగేశ్వర్రావు, జడ్పీ సీఈఓ అప్పారావు, డీఆర్డీఓ మధుసూదన్రాజు, డీఎఫ్ఓ సతీశ్కుమార్, ఆర్డీఓ వేణుమాధవ్, తాసీల్దార్ శ్యామసుందర్రెడ్డి, డీఎంహెచ్ఓ కోటాచలం, డీఎస్ఓ మోహన్బాబు పాల్గొన్నారు.
పోస్టల్ బ్యాలెట్కు 10 వరకు గడువు
ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ఓటు వేయడానికి ఈ నెల 10 వరకు గడువు పెంచినట్లు కలెక్టర్ ఎస్. వెంకట్రావ్ తెలిపారు. ఈ నెల 3 నుంచి 8వరకు ఫెసిలిటేషన్ కేంద్రాల్లో పోస్టల్ బ్యాలెట్ వేయడానికి అవకాశం కల్పించగా దానిని ఎన్నికల సంఘం మరో రెండు రోజులు గడువు పెంచిందని పేర్కొన్నారు. 9, 10వ తేదీల్లో సైతం ఆయా నియోజక వర్గ కేంద్రాల్లో ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం ఉందని తెలిపారు.