కారేపల్లి, ఆగస్టు 13 : మానవత్వంతో అమరత్వం.. మరణానంతర జీవమని, నేత్ర దానంతో మరో జీవితకాలం జిందగీని చూద్దామని తెలంగాణ నేత్ర అవయవ శరీర దాతల సంఘం రాష్ట్ర సహాధ్యక్షుడు డాక్టర్ పరికిపండ్ల అశోక్ అన్నారు. ప్రపంచ అవయవదాన దినోత్సవంను పురస్కరించుకుని గురువారం సింగరేణి మండల పరిధిలోని కొత్త కమలాపురం గ్రామంలో అవయవ దాతల సంఘ సమావేశం ఏర్పాటు చేశారు. ముందుగా అవయవ దానంపై ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… అవయవ దానంతో ఆరిపోతున్న జీవితాలకు వెలుగునివ్వాలన్నారు. పార్థివ దేహ దానంతో పలువురు వైద్యులకు గురువుగా నిలిచి చనిపోయిన తర్వాత చిరంజీవులుగా జీవించాలన్నారు.
ప్రతి మనిషి చనిపోయిన తర్వాత పార్థివ దేహాన్ని కాల్చడం ద్వారా బూడిద పాలు చేయకుండా, నేలలో పాతిపెట్టి మట్టి పాలు చేయకుండా నేత్రదానం చేసి మరొక ఇద్దరికి చూపునివ్వాలన్నారు. మెడికల్ కళాశాలలకు పార్థివదేహాన్ని దానం చేసి భావి భారత వైద్యులకు గురువుగా నిలుద్దామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అవయవదాతల సంఘం సభ్యులు, ఆశా భవన్ అధినేత విజయ్, వడ్డే తిరుపతయ్య, చాగంటి వెంకటేశ్వర్లు, బానోతు గోవింద్, ఆల రామయ్య, కోటి తిరుపయ్య, మండేపూడి కృష్ణయ్య, గిరి, తిరుమలయ్య, సహజ, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.