SBI Q4 Results | కేంద్ర ప్రభుత్వ రంగ బ్యాంక్- భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ) గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికం ఫలితాల్లో అదరగొట్టింది. 2022-23తో పోలిస్తే 2023-24 మార్చి త్రైమాసికంలో ఎస్బీఐ నికర లాభం 24 శాతం పెరిగింది. 2022-23 మార్చి త్రైమాసికంలో ఎస్బీఐ నికర లాభం రూ.16,694.5 కోట్లు కాగా, గత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో రూ.20,698 కోట్లకు చేరుకున్నది.
బ్యాంక్ నికర వడ్డీ ఆదాయం (ఎన్ఐఐ) స్వల్పంగా 3.1 శాతం పెరిగి రూ.41,656 కోట్లకు చేరింది. 2022-23లో అది రూ.40,392.5 కోట్లు మాత్రమే. 2023-24 మార్చి త్రైమాసికంలో స్థూల మొండి బకాయిలు (ఎన్పీఐ) 2.9 శాతం, నికర మొండి బకాయిలు (ఎన్పీఐ) 6.1 శాతం తగ్గాయి. ఈ నేపథ్యంలో 2023-24 ఆర్థిక సంవత్సరంలో వాటాదారులకు రూ.13.7 డివిడెండ్ ప్రకటించింది. మార్చి నెలాఖరు నాటికి ఎస్బీఐలో డిపాజిట్లు రూ.47.6 లక్షల కోట్ల (డిసెంబర్ త్రైమాసికం) నుంచి రూ.49 లక్షల కోట్లకు పుంజుకున్నాయి.
మార్కెట్ అంచనాలను బ్రేక్ చేయడంతో గురువారం దేశీయ స్టాక్ మార్కెట్లలో ఎస్బీఐ షేర్ 52 వారాల గరిష్ట స్థాయిని దాటి మూడు శాతానికి పైగా లబ్ధి పొందింది. బీఎస్ఈలో ఎస్బీఐ షేర్ 3.60 శాతం పెరిగి 52 వారాల గరిష్ట స్థాయి రూ.839.60 వద్ద నిలిచింది. ఎన్ఎస్ఈలో బ్యాంక్ షేర్ 1.13 శాతం పుంజుకుని రూ.820 వద్ద ముగిసింది. ఇంట్రాడే ట్రేడింగ్లో రూ.839.65లతో గరిష్టాన్ని తాకింది.