న్యూఢిల్లీ: భారతీయులున్న దుబాయ్ విమానం జమైకాలో ల్యాండ్ అయ్యింది. అయితే సరైన పత్రాలు లేకపోవడంతో ఆ విమానాన్ని అక్కడి నుంచి వెనక్కి పంపారు. దీంతో మరో డాంకీ ప్లైట్ (donkey’ flight) విషయం వెలుగులోకి వచ్చింది. భారతీయులు, ఇతర విదేశీ పౌరులతో సహా 253 మంది ప్రయాణించిన చార్టర్డ్ విమానం గత గురువారం దుబాయ్ నుంచి జమైకాకు చేరుకుంది. ఆ విమానంలోని కొంత మంది భారతీయులు ఐదు రోజుల పర్యటన కోసం అక్కడకు వచ్చినట్లు ఇమ్మిగ్రేషన్ అధికారులకు తెలిపారు. అయితే ఒక రోజు టూర్కు సంబంధించి మాత్రమే వారి వద్ద పత్రాలున్నట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలో ఆ చార్టర్డ్ విమానాన్ని వెనక్కి పంపారు.
కాగా, భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎంఈఏ) గురువారం ఈ విషయాన్ని ధృవీకరించింది. భారతీయులతో కూడిన దుబాయ్ విమానాన్ని జమైకా నుంచి వెనక్కి పంపారని తెలిపింది. ‘అనేక మంది భారతీయులు ఉన్న దుబాయ్ చార్టర్డ్ ఫ్లైట్ జమైకాలో ల్యాండ్ అయ్యిందని మాకు తెలిసింది. వారికి ముందస్తు ప్రయాణం, హోటల్ బుకింగ్లు ఉన్నాయి. అయినప్పటికీ స్థానిక అధికారులు వారి పత్రాలతో సంతృప్తి చెందలేదు. మే 7వ తేదీన వారిని తిరిగి దుబాయ్కు పంపారు’ అని ఎంఈఏ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ వెల్లడించారు.