Trikutalayam | వందల ఏళ్లపాటు ఆ ఆలయం ధూప దీప నైవేద్యాలకు నోచుకోలేదు. అద్భుతమైన శిల్ప కళా సంపద ధ్వంసమైంది. ఆలయ భూములు సైతం కబ్జా కోరల్లో చిక్కుకున్నాయి. అందమైన చెరువు గట్టుపై శిథిలమై ఉన్న త్రికూటాలయంలో చెట్లు, చేమలతో అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా మారింది. అటువంటి తరుణంలో గ్రామస్తులు చేయి చేయి కలిపి ఆలయ పునరుద్ధరణకు నడుంబిగించారు. కాకతీయుల కళా వైభవానికి ప్రతీకగా నిలిచిన త్రికూటాలయాన్ని కొన్ని సంవత్సరాల క్రితం అందంగా మెరుగులు దిద్ది.. అనునిత్యం ధూప, దీప నైవేద్యాలతో ఆలయంలో పూజలు చేస్తున్నారు.
హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముత్తారం గ్రామంలో త్రికుటాలయం ఉంది. సంధ్యా సమయంలో భానుడి కిరణాలు శివలింగానికి తగిలేలా పడమర దిక్కున ఆలయాన్ని నిర్మించారు. అధిష్టాన వేదిక నక్షత్రాకారంలో ఉండగా తూర్పుకి అభిముఖాన గర్భాలయంలో శివుడు, ఉత్తరాభి ముఖాన ఆదిత్యుడు, దక్షిణాభి ముఖాన కేశవమూర్తి విగ్రహాలు ఉన్నాయి.
ఆలయ నిర్మాణ శైలి:
అతి ప్రాచీన త్రికూటాలయం క్రీ.శ.11-13 వ శతాబ్ద కాలంలో కాకతీయులు నిర్మాణం చేపట్టినట్లు చరిత్రకారుల అభిప్రాయం. కాకతీయుల పాలనలో నిర్మితమైన ఆలయాల్లో విస్తారంగా శివ, కేశవ ఆలయాలు ఉండటం ఇందుకు నిదర్శనం. ఇక్కడి శివ, కేశవ గర్భాలయాల్లో శివలింగాలను గ్రానైట్ తో నిర్మించారు. శివ లింగాలకు బ్రహ్మ సూత్రాలు ఉండటం విశేషం.
గర్భాలయాల్లో శివలింగాలు, అంతరాలయంలో ఇరువైపుల శేరె(ద్వార బంధం)లు, ద్వారపాలకులు, ఒక పక్కన ఘటాదారిణిలతో మంగళ సూచిక శిల్పాలు, మరో పక్కన చామర దారిణిలు, ఉత్తరాశిపై గజలక్ష్మీ, ప్రస్థరం పైన సూక్ష్మ నాగర శిఖరాలు, 16 ఆకులతో భువన శిల్పం ఉన్నాయి. కేశవమూర్తి విగ్రహం ధ్వంసం కావడంతో గర్భాలయాన్ని మూసివేశారు. రంగ మండపంలో ఎలాంటి స్తంభాలు లేవు. 100 ఏళ్ల క్రితమే అవి మాయం అయ్యాయి. ఆలయంలో నంది విగ్రహం లేదు.
ధ్వంసమైన కేశవ మూర్తి విగ్రహం:
దక్షిణానికి అభిముఖంగా కేశవమూర్తి గర్భాలయం ఉంది. కేశవమూర్తి విగ్రహంలో శిరస్సున మకుటం, పరహస్తాలు ధ్వంసం కాగా చేతులకు కంకణాలు పైన శంఖము, చక్రము ఆనవాళ్లు ఉన్నాయి. నిజ హస్తాలు పూర్తిగా ధ్వంసం అయ్యాయి. విగ్రహానికి కంఠాభరణాలు, హై గ్రైవేయకాలు, నడుముకు మేఖల ఉన్నాయి. కాళ్లకు కడియాలు ఎడమ భాగాన నమస్కరిస్తూ గరుత్మంతుడు, కుడివైపున లక్ష్మీదేవి ఉండగా ఇరువైపులా చామరదారిణిలు ఉన్నారు.
ఆలయంలో కొంతమేర కక్ష్యాసనం ధ్వంసం కాగా.. కింద భాగాన ఇరువైపుల పద్మ ధార, ప్రదక్షణ పథంలో కుడ్య స్థంభికలు, విమాన నమూనాలను చూడవచ్చు.
అద్భుత శైలిలో విఘ్నేశ్వరుడు :
ఆలయానికి కొంత దూరంలో విఘ్నేశ్వరుడి విగ్రహం ఉంది. పరహస్తాల్లో అంకుశం, పాశం ఉండగా నిజహస్తాల్లో వరద ముద్ర, లడ్డు ఉన్నాయి. సుఖాసనంలో ఉన్న గణపతికి ఉదర బంధ సర్పం ఉంది. ఆలయ ప్రదక్షిణ పథంలో ఒక మూలన ఆంజనేయస్వామి విగ్రహం ఉండగా, పక్కనే ఉన్న చిన్న బోడుపై శిరస్సులేని చాముండ విగ్రహం ఉంది. ఆలయ పరిసరాల్లో ఎటువంటి శాసనం లేదు. పవిత్ర కోనేరు సైతం భూమిలోనే కూరుకుపోయిందని గ్రామస్తులు చెబుతారు.
తమ గ్రామానికి రక్షణ దేవాలయంగా భావించిన ప్రజలు ఆలయ పునరుద్ధరణ కమిటీగా ఏర్పడ్డారు. ప్రతి ఏటా మహాశివరాత్రి, కార్తీక మాసంలో ప్రత్యేక పూజలు చేస్తున్నారు. వర్షాలు సంమృద్ధిగా కురవాలని, పంటలు బాగా పండాలని, మొక్కులు చెల్లిస్తున్నారు. చారిత్రక శిల్ప కళా వైభవానికి ప్రతీకగా నిలిచిన ఈ ఆలయానికి భక్తులు నిత్యం వచ్చి దర్శించుకుంటున్నారు.
వారసత్వ సంపదను పరిరక్షించాలి : కొత్త తెలంగాణ చరిత్ర బృందం కన్వీనర్ శ్రీరామోజు హరగోపాల్

ముత్తారం అని పేరున్న ప్రతి గ్రామంలో దాదాపు ఒక చారిత్రక ఆలయం ఉంది. పురాతన ఆలయాలు పరిరక్షించడం మన అందరి సామాజిక బాధ్యత. ప్రభుత్వం పురాతన ఆలయాల పునరుద్ధరణపై ప్రత్యేక దృష్టి సారించకుంటే భవిష్యతు తరాలకు వాటి ఉనికి తెలియకుండా పోతుంది.
ఆలయంలో నిత్య పూజలు : ఆలయ పునరుద్ధరణ కమిటీ చైర్మన్ కాశిరెడ్డి ఆదిరెడ్డి

చారిత్రక త్రికూటాలయం మా గ్రామంలో ఉండటం మా అదృష్టం. అందుకే గ్రామస్తులం అంతా ఏకమై ఒక కమిటీగా పూనుకున్నాం. ఇప్పుడు ఆలయంలో నిత్య పూజలు జరుగుతున్నాయి. కొత్తగా ధ్వజ స్తంభం, నవ గ్రహాలు, నంది విగ్రహాలు తీసుకొచ్చాం. త్వరలోనే వాటి ప్రతిష్ట జరుగుతుంది. నిత్యం వచ్చే భక్తులకు పూర్తి సదుపాయాలు కల్పిస్తున్నాం..





Cognizant jobs | కాగ్నిజెంట్లో ఉద్యోగాలు.. 25 వేల మంది ఫ్రెషర్ల రిక్రూట్మెంట్
Aitel Plans | ఎయిర్టెల్ ప్లాన్లపై అన్లిమిటెడ్ డాటా ఆఫర్
Chandrahas | చంద్రహాస్ ‘గుంజి గుంజి’ పాట వివాదం .. పోలీస్ కేసు వరకు వెళ్లిన తగాదా