పర్వతగిరి, జనవరి 3: పోరాడి సాధించుకున్న రాష్ర్టాన్ని బంగారు తెలంగాణగా మార్చడమే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యమని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో తొలి అమరుడు దొడ్డి కొమురయ్యపై కల్లెడ గడిలో నిర్మిస్తున్న సినిమా షూటింగ్ను గురువారం ఎర్రబెల్లి దయాకర్రావు టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే అరూరి రమేశ్తో కలిసి ప్రారంభించారు. వీఆర్ ఇంటర్నేషనల్ పతాకంపై మురళి దర్శకత్వంలో, వీరారెడ్డి, ప్రముఖ సీనియర్ జర్నలిస్టు పాశం యాదగిరి సారథ్యంలో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ తెలంగాణ సాయుధ పోరాటంలో అనేక మంది అమరులయ్యారని గుర్తుచేశారు. వారిలో మొదట దొడ్డి కొమురయ్య కడవెండిలో సంఘం సమావేశం నిర్వహిస్తుండంగా రజాకార్లు జరిపిన కాల్పుల్లో అమరుడయ్యాడని గుర్తుచేశారు. ఆయన పోరాట స్ఫూర్తితో ఎందరో త్యాగాల ఫలితంగా సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ర్టాన్ని సాధించారని వివరించారు.
రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలిపేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ అహర్నిశలు కృషి చేస్తున్నారని కొనియాడారు. భావితరాల వారికి అనాటి పోరాట యోధుల జీవిత చరిత్రలు తెలియాల్సి ఉందన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మన చరిత్ర, సంస్కృతి, వైతాళికులు నిర్లక్ష్యానికి గురైనట్లు మంత్రి ఎర్రబెల్లి ఆవేదన వ్యక్తం చేశారు. దొడ్డి కొమురయ్య చరిత్రపై సినిమా తీస్తుండడం అభినందనీయమన్నారు. అరూరి రమేశ్ మాట్లాడుతూ నిజాం నిరంకుశ పాలనలో భూమి, భుక్తి, విముక్తి కోసం జరిగిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో తొలి అమరుడు దొడ్డి కొమురయ్య అని, అలాంటి గొప్ప వీరుడి జీవిత చరిత్రను సినిమాగా చిత్రీకరించడం గొప్ప విషయమన్నారు. కార్యక్రమంలో ఆర్డీఎఫ్ ప్రతినిధి రామ్మోహన్రావు, కల్లెడ మురళీధర్రావు, జడ్పీటీసీ లునావత్ పంతులు, పీఏసీఎస్ చైర్మన్ మోటపోతుల మనోజ్కుమార్గౌడ్, వైస్ ఎంపీపీ ఎర్రబెల్లి రాజేశ్వర్రావు, సర్వర్, రంగు కుమార్గౌడ్ పాల్గొన్నారు.