హనుమకొండ, డిసెంబర్ 16 : తెలంగాణలో వడ్లు కొనేది లేదని ఓ వైపు కేంద్రం కక్షగట్టినా రైతుల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వం అన్నదాతలకు రంది లేకుండా చేస్తున్నది. పంట అమ్ముకోవడంలో కర్షకులెవరూ ఇబ్బంది పడొద్దన్న ఉద్దేశంతో ఎప్పటిలానే ఊరూరా కాంటాలు పెట్టి వానకాలం వడ్లు కొంటున్నది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఈ సీజన్లో 1096 కొనుగోలు కేంద్రాలు పెట్టి జిల్లాలవారీగా లక్ష్యంలో 40 నుంచి 70శాతం సేకరణ పూర్తి చేసింది. ధాన్యం కొన్న రెండు రోజుల్లోనే రైతుల ఖాతాల్లో డబ్బు జమ చేస్తున్నది. జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో వానకాలం పంట ఆలస్యంగా వేయడంతో కొనుగోళ్లు సైతం లేటుగా మొదలయ్యాయి. మిగతా నాలుగు జిల్లాల్లో సేకరణ ఉద్యమంలా కొనసాగుతున్నది. సొంత ఊరిలోనే ధాన్యాన్ని అమ్ముకుంటున్న ప్రతి రైతులో గుండె నిబ్బరం కనిపిస్తున్నది.
వరంగల్లో వడ్ల కొనుగోలు ఉద్యమంలా నడుస్తున్నది. జిల్లాలో ఐకేపీ 48, పీఏసీఎస్ 119, ఏఎంసీ 2, జీసీసీకి 1, రైతు ఉత్పత్తి సంఘాల ద్వారా 24 మొత్తం 194 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. వరి కోతలు ముందుగా ప్రారంభమయ్యే వర్ధన్నపేట, రాయపర్తి, పర్వతగిరి, సంగెం, ఖిలావరంగల్, వరంగల్, గీసుగొండ మండలాల్లోని కేంద్రాల్లో నవంబర్ చివరి వారం నుంచే కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. తర్వాత నెక్కొండ, చెన్నారావుపేట, నర్సంపేట, దుగ్గొండి, నల్లబెల్లి, ఖానాపురం మండలాల్లో మొదలయ్యాయి. ఈ నెల ఒకటి నుంచి ముమ్మరమయ్యాయి. ప్రస్తుతం 183 సెంటర్ల ద్వారా కొనుగోళ్లు జోరందుకున్నాయి. 170 కేంద్రాల్లో గురువారం వరకు 80,631 మెట్రిక్ టన్నుల వడ్లు కొన్నట్లు పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ భాస్కర్రావు తెలిపారు. ఐకేపీ సెంటర్లలో 25,676 మెట్రిక్ టన్నులు, పీఏసీఎస్ల సెంటర్లలో 49,213, జీసీసీలో 249, ఏఎంసీ సెంటర్లలో 1,233, రైతు ఉత్పత్తి సంఘాల సెంటర్లలో 4,260 మెట్రిక్ టన్నుల వడ్లను కొన్నామని, వీటి విలువ రూ.157.27 కోట్లు ఉంటుందని తెలిపారు.
రైతుల ఖాతాల్లో రూ.125 కోట్లు జమ
హనుమకొండ జిల్లాలో ఐకేపీ ఆధ్వ ర్యంలో 52, పీఏసీఎస్ల ఆధ్వర్యంలో 103 మొత్తం 155 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి అన్ని కేంద్రాల్లోనూ కొనుగోళ్లు చేపడుతున్నారు. సన్న, దొడ్డు రకం కలిపి జిల్లాలో 2.51 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించాలని లక్ష్యంగా పెట్టుకోగా, ఇప్పటి వరకు లక్షా514 టన్నుల (40శాతం) ధాన్యాన్ని కొన్నారు. నెలాఖరులోగా పూర్తి చేస్తామని పౌర సరఫరాల శాఖ అధికారులు తెలిపారు. ధాన్యం మిల్లింగ్ కోసం జిల్లాలో 54 మిల్లులను ఎంపిక చేశారు. ఏ గ్రేడ్ రకం ధాన్యం ఎంఎస్పీ క్వింటాకు రూ.1960, సాధారణ రకం రూ.1940 చెల్లిస్తున్నారు. ఇప్పటి వరకు రూ.125 కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేశారు. సినట్లు అధికారులు పేర్కొన్నారు. ఇప్పటికే రైస్ మిల్లుల నుంచి ఎఫ్సీఐకి 8వేల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ఇచ్చినట్లు అధికారులు తెలిపారు.
ఇప్పటివరకు రూ.18.77కోట్లు రైతుల ఖాతాల్లో జమ
మహబూబాబాద్ జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు జోరుగా కొనసాగుతున్నాయి. గత నెల 8న తొర్రూరు మండలం అమ్మాపురంలో కొనుగోలు కేంద్రాన్ని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ప్రారంభించగా అప్పటి నుంచి జిల్లా వ్యాప్తంగా కేంద్రాలను అధికారులు ప్రారంభిస్తూ వస్తున్నారు. ధాన్యం అమ్మిన 48గంటల్లోనే రైతుల ఖాతాల్లో డబ్బు జమచేస్తున్నారు. ఈ వానకాలం జిల్లాలో 2.50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందని అంచనా వేశారు. 240 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించి ప్రస్తుతం 229 సెంటర్లను ప్రారంభించి 212 కేంద్రాల ద్వారా ధాన్యం సేకరిస్తున్నారు. ఐకేపీ-69, పీఏసీఎస్ – 143, గిరిజన కో-ఆపరేటివ్ సొసైటీలు-10, మార్కెటింగ్ -4, మెప్మా ఆధ్వర్యంలో-3 కేంద్రాల ద్వారా ధాన్యం సేకరిస్తున్నారు. ఇప్పటి వరకు 8,852మంది రైతుల నుంచి 47,013.720 టన్నుల ధాన్యం కొన్నారు. మిల్లులకు రవాణా చేసేందుకు ఆరు సెక్టార్లుగా విభజించారు. జిల్లాలో మొత్తం 31 రైస్ మిల్లులు ఉండగా, వీటిలో 22 రా రైస్ మిల్లులు, 9 బాయిల్డ్ రైస్ మిల్లులున్నాయి. కొన్న ధాన్యాన్ని ఎప్పటికప్పుడు మిల్లులకు తరలిస్తున్నారు. 62 ఐకేపీ కేంద్రాల ద్వారా 12,925.840 మెట్రిక్ టన్నులు, 138 పీఏసీఎస్ల ద్వారా 31,526.120 మెట్రిక్ టన్నులు, 8 జీసీసీ సెంటర్ల ద్వారా 1,974.040 మెట్రిక్ టన్నులు, మూడు వ్యవసాయ మార్కెట్ల ద్వారా 435.160 మెట్రిక్ టన్నులు, ఒక మెప్మా కేంద్రం ద్వారా 152.560 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ఇప్పటికే కొనుగోలు చేశారు. కొన్న ధాన్యం విలువ రూ. 91.66 కోట్లు కాగా, ఇందులో రూ.31.43కోట్లు ఆన్లైన్లో నమోదు చేసి రూ.18.77 కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేశారు. మిగతా రూ.12.66కోట్ల జమ ఆన్లైన్ ప్రాసెస్లో ఉంది.
కొనుగోళ్ల లక్ష్యం 70శాతం పూర్తి
జనగామ జిల్లాలో వానకాలం సీజన్ 2.80లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడిలో 50 శాతం అంటే 1.40 లక్షల మెట్రిక్ టన్నులు సన్న వడ్లు, 1.40లక్షల మెట్రిక్ టన్నుల దొడ్డు వడ్లు వస్తాయని అధికారులు అంచనా వేశారు. ఈ సారి దిగుబడి తగ్గడంతో సేకరణ లక్ష్యాన్ని 1.50మెట్రిక్ టన్నులకు కుదించారు. ఇప్పటికే లక్ష మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోళ్లు పూర్తి చేసి 70వేల మెట్రిక్ టన్నులకు సంబంధించి రైతుల ఖాతాల్లో డబ్బు జమ చేశారు. జిల్లాలోని 12 మండలాల పరిధిలో 195 కేంద్రాలు ఏర్పాటు చేసి దిగుబడులు తగ్గిన కారణంగా 11చోట్ల కేంద్రాలను తొలగించారు. డీఆర్డీవో ఆధ్వర్యంలో 119, పీఏసీఎస్ల ఆధ్వర్యంలో 72, వ్యవసాయ మార్కెట్ కమిటీల ద్వారా 4 కేంద్రాల్లో ధాన్యం కొంటున్నారు.
4,336 మంది రైతుల నుంచి 30 వేల మెట్రిక్ టన్నుల సేకరణ
ములుగు జిల్లాలోని 9మండలాల పరిధిలో 174 పంచాయతీలకు గాను 170 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించి, ప్రస్తుతం 118 కేంద్రాల ద్వారా వడ్లను సాఫీగా సేకరిస్తున్నారు. గత నెల 23 నుంచి కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. జిల్లా వ్యాప్తంగా వానకాలం, యాసంగి పంటలు ఆలస్యంగా చేతికి వస్తాయి. ఈ కారణంగా జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు ఆలస్యంగా మొదలై ఫిబ్రవరి మొదటి వారం దాకా కొనసాగుతాయి. కాగా ఇప్పటివరకు 118 కేంద్రాల్లో 4,336 మంది రైతుల నుంచి 3,0672.435 మెట్రిక్ టన్నుల వడ్లను సేకరించారు. కొన్న వడ్లను ఎప్పటికప్పుడు జిల్లాలోని 25 రైస్ మిల్లులకు చేరవేస్తున్నారు.
రైతుల ఖాతాల్లో రూ.1,94,65,480 జమ
జిల్లాలో వానకాలం వరి సాగు ఆలస్యంగా ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో పంట కోతలు కూడా ఆలస్యంగా మొదలయ్యాయి. జిల్లా వ్యాప్తంగా 1.50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాలని లక్ష్యం పెట్టుకొని 11 మండలాల పరిధిలో 205 కేంద్రాలను ప్రారంభించారు. ఐకేపీ ఆధ్వర్యంలో 16, జీసీసీల ద్వారా 6, పీఏసీఎస్ల ద్వారా 180, ఓడీసీఎంఎస్ ద్వారా 3 సెంటర్లలో ధాన్యం కొనుగోళ్లు చేస్తున్నారు. 1,876మంది రైతుల నుంచి ఇప్పటి వరకు 10,944 మెట్రిక్ టన్నుల ధాన్యం కొన్నారు. గ్రేడ్ -ఏ రకం 3,850 మెట్రిక్ టన్నులు, కామన్ గ్రేడ్ రకం 7,093 మెట్రిక్ టన్నులు సేకరించారు. 10,896 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సీఎంఆర్ కోసం తరలించారు. రైతుల ఖాతాల్లో రూ.1,94,65,480 జమ చేశారు. జిల్లాలో జనవరి చివరి వరకు కొనుగోళ్లు పూర్తిచేస్తామని అధికారులు తెలిపారు.
వేగవంతం చేస్తున్నాం..
జిల్లాలో వరి ధాన్యం కోతలు ఆలస్యంగా ప్రారంభమయ్యాయి. జిల్లాలో 205 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాం. ఇప్పుడిప్పుడే కొనుగోళ్లు వేగవంతం అవుతున్నాయి. రైతులు ఆరబెట్టిన ధాన్యాన్ని కేంద్రాలకు తీసుకొస్తే తూకం వేయడానికి ఇబ్బందులు ఉండవు.
మూడు రోజుల్లోనే పేమెంట్
పక్కా ప్రణాళికతో జిల్లాలో వడ్ల కొంటు న్నాం. రైతులు ఇబ్బంది పడకుండా ప్రతి సెంటర్లో మౌలిక వసతులను ఏర్పాటు చేశాం. వడ్ల ప్రభుత్వ మద్దతు ధరను తెలియ జేస్తున్నాం. కొనుగోలు కేంద్రాల్లో వడ్లు అమ్మిన రైతులకు మూడు నుంచి ఐదు రోజు ల్లోగా వారి బ్యాంకు ఖాతాలో డబ్బు జమ చేస్తున్నాం. జనవరి 25వ తేదీ వరకు కొను గోళ్లు కొనసాగే అవకాశం ఉంది.
ఇప్పటికే లక్ష టన్నులు కొన్నం
జిల్లావ్యాప్తంగా అన్ని కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్లు జరుగుతోంది. కేంద్రాల వద్ద రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా అన్ని ఏర్పాట్లు చేశాం. ఏదైనా కేంద్రం వద్ద సమస్యలు తలెత్తితే జిల్లా అదనపు కలెక్టర్, అధికారులు దృష్టికి తీసుకెళ్లి వెంటనే పరిష్కరిస్తున్నాం. ఇప్పటికే లక్ష టన్నులకు పైగా ధాన్యం కొనుగోళ్లు పూర్తయ్యాయి. నెలాఖరు వరకు కొనుగోలు ప్రక్రియ పూర్తయే అవకాశం ఉంది.