ములుగు, మే 18 (నమస్తే తెలంగాణ) : లారీ యజమానులు, రైస్ మిల్లర్లు ధాన్యాన్ని మిల్లులకు ఎందుకు తరలించడం లేదని ఇంచర్ల పీఏసీఎస్ చైర్మన్ చిక్కుల రాములు రైతులు నిలదీశారు. ములుగు మండలం జంగాలపల్లి గ్రామం పీఏసీఎస్ కొనుగోలు కేంద్రం వద్ద వడ్లను 20 రోజులుగా ఎందుకు కొనుగోలు చేయడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వచ్చిన లారీలను వెల్లగొట్టడం ఏమిటని మండిపడ్డారు. గురు, శుక్రవారాల్లో కురిసిన వర్షానికి ధాన్యం తడిసింది. శనివారం సివిల్ సప్లయ్ డీఎం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి కాంటాలు వేసిన ధాన్యాన్ని రైస్ మిల్లులకు తరలించాలని ఆదేశించారు. అయినా కొనుగోలు కేంద్రం నిర్వాహకులు పట్టించుకోలేదు. సాయంత్రం ఒక లారీ ధాన్యపు బస్తాలను తరలించేందుకు కొనుగోలు కేంద్రం వద్దకు రాగా గతంలో ధాన్యాన్ని తరలించిన ఒక లారీ యజమాని మూడు రోజుల క్రితం ఎగుమతికి బాణాలపల్లి రైస్ మిల్లుకు పంపించగా అక్కడ వారు దిగుమతి చేసుకోవడం లేదని, వెయిటింగ్ కిరాయిలు పడుతున్నాయని తెలిపాడు. దీంతో రైతులు రైస్ మిల్లర్లతో మాట్లాడించిన తర్వాతనే వడ్లను లోడ్ చేసుకుంటామని లారీ యజమాని తెలియజేయడంతో ధాన్యం తరలింపు నిలిచిపోయింది. ఈ విషయంపై పీఏసీఎస్ చైర్మన్ను రైతులు, హమాలీలు నిలదీశారు. దీంతో చైర్మన్ జిల్లాలో 70 లారీలు ఉంటే 150 కొనుగోలు కేంద్రాలు ఉన్నాయని, ధాన్యం తరలింపు విషయంలో ఇబ్బందులు ఏర్పడుతుందని రైతులకు నచ్చజెప్పారు. మళ్లీ వర్షం వస్తే వడ్లు తడుస్తాయని, 20 రోజులుగా అనుకున్న మేరకు ధాన్యం కొనుగోలు చేపట్టకుండా ఇబ్బందులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
వరి కోసిన వెంటనే కొనుగోలు చేయాలి
వరి కోసిన వెంటనే కొనుగోలు చేసి మద్దతు ధర కల్పించాలని తెలంగాణ రైతు సంఘం ములుగు జిల్లా కార్యదర్శి గఫూర్పాషా డిమాండ్ చేశారు. శనివారం ఆయన మండలంలోని జంగాలపల్లి వద్ద తడిసిన వడ్లను పరిశీలించారు. అధికారులు బాయిల్డ్ రైస్ మిల్లర్లతో మాట్లాడి కోసిన తడి వడ్లను నేరుగా తరలించి కొనుగోలు చేపట్టాలన్నారు. అకాల వర్షాలు కురుస్తున్నందున ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులు ధాన్యాన్ని ఆరబోసి తేమ శాతాన్ని తగ్గించలేకపోతున్నారని తెలిపారు.