New Criminal Laws | బ్రిటీష్ కాలం నాటి చట్టాల స్థానంలో కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన మూడు క్రిమినల్ చట్టాలపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్పై సర్వోన్నత న్యాయస్థానం సోమవారం విచారించనున్నది. కొత్త క్రిమినల్ చట్టాల్లో చాలా అసమానతలున్నాయని పిటిషన్ పేర్కొన్నారు. జస్టిస్ బేలా ఎం త్రివేది, జస్టిస్ పంజక్ మిట్టల్తో కూడిన వెకేషన్ బెంచ్ పిటిషన్పై విచారణ జరుపనున్నది. కేంద్రం తీసుకువచ్చిన చట్టాలను న్యాయవాది విశాల్ తివారీ సవాల్ చేశారు.
కొత్త చట్టాలను అమలు చేయకుండా నిషేధం విధించాలని కోరారు. చట్టాలపై పార్లమెంట్లో చర్చ జరగలేదని.. ప్రతిపక్ష ఎంపీలను సస్పెండ్ చేసిన సమయంలో చట్టాలను ఆమోదించినట్లుగా ఆరోపించారు. క్రిమినల్ చట్టాల ప్రాక్టికాలిటీని పరిశీలించేందుకు నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని పిటిషన్లో కోరారు. కొత్త క్రిమినల్ చట్టాలు కఠినంగా ఉన్నాయని.. దేశంలో పోలీసు పాలనను తీసుకువస్తాయని పిటిషనర్ ఆరోపించారు. చట్టాలను దేశ ప్రజల ప్రాథమిక హక్కులను ఉల్లంఘిస్తున్నాయని.. బ్రిటీష్ పాలన చట్టాల కంటే కఠినంగా ఉన్నాయని పేర్కొంది.
పాత చట్టాల్లో 15 రోజుల కస్టడీ ఉంచాలనే నిబంధన ఉండగా.. దాన్ని కొత్త చట్టాల్లో 90 రోజులకు పెంచినట్లు ప్రస్తావించారు. గతేడాది డిసెంబర్లో కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో కొత్త చట్టాల బిల్లును ప్రవేశపెట్టి ఆమోదించింది. ఇండియన్ పీనల్ కోడ్ (IPC), సీఆర్పీసీ, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ స్థానంలో భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక్ సురక్ష, భారతీయ సాక్ష్య చట్టాలను తీసుకువచ్చింది. ఈ బిల్లులకు రాష్ట్రపతి ఆమోద ముద్ర వేశారు. ఈ ఏడాది జులై నుంచి అమలులోకి రానున్నాయి.