హనుమకొండ చౌరస్తా, ఆగస్టు 2 : ఉద్యమంలో పాల్గొన్నవారికి తెలంగాణ వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ పదవులు ఇచ్చారు. టీఆర్ఎస్లో పదవులు అనుభవించి కొందరు ఇప్పుడు పార్టీని వీడి ఆత్మగౌరవం గురించి మాట్లాడుతున్నారని వారిది ఆత్మగౌరవమో.. ఆత్మవంచనో వారే తెలుసుకోవాలని అగ్రోస్ మాజీ చైర్మన్ లింగంపల్లి కిషన్రావు అన్నారు.
మంగళవారం హనుమకొండలోని కాకతీయ హరిత హోటల్ ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. టీఆర్ఎస్లో తాను 2001 నుంచి సీనియర్ నేతగా, ఉద్యమకారుడిగా, 10 జిల్లాల్లో పనిచేసిన అనుభవం ఉందని, ఇప్పటిరకు అన్ని పదవులు అనుభవించి పార్టీని వీడిన కొందరు ఇప్పుడు ఆత్మగౌరవం గురించి మాట్లాడవద్దని ఆయన హితవు పలికారు.
నాడు ఉద్యమంలో పనిచేసిన దిలీప్కుమార్, ఈటల రాజేందర్, విజయరామారావు, చంద్రశేఖర్, విజయశాంతి, రవీందర్నాయక్, కన్నెబోయిన రాజయ్యయాదవ్ పదవులు అనుభవించి పార్టీని వీడినవారేనని వారిది ఆత్మగౌరవం కాదు ఆత్మవంచనా అని ప్రశ్నించారు.
సీఎం కేసీఆర్ ఉన్నతస్థానంలో కూర్చోబెట్టి ఉద్యమకారులకు కార్పొరేషన్, జిల్లాపరిషత్ చైర్మన్ల పదవులిచ్చారని గుర్తుచేశారు. అసలు కాంగ్రెస్, బీజేపీలకు ఆత్మగౌరవం ఉందా అని ఆయన ప్రశ్నించారు. టీఆర్ఎస్తోనే అభివృద్ధి సాధ్యమన్నారు.