తాడ్వాయి, మే 15 : ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని కాటాపురం అంగన్వాడీ సెంటర్-3లో టీచర్గా పనిచేస్తున్న రడం సుజాత(48) హత్యకు గురైంది. ఈ ఘటన బుధవారం వెలుగులోకి వచ్చింది. ఏటూరునాగారం మండలం చిన్నబోయినపల్లికి చెందిన సుజాత కాటాపురం అంగన్వాడీ సెంటర్లో విధులు నిర్వర్తిస్తున్నది. మంగళవారం స్వగ్రామం నుంచి కాటాపురానికి చేరుకున్న సుజాత విధులు ముగించుకొని మధ్యాహ్నం 1:30 గంటలకు ఇంటికి వెళ్లేందుకు బయటకు వెళ్లింది. బస్సు మిస్ కావడంతో గుర్తు తెలియని వాహనం ఎక్కింది. బుధవారం ఉదయం కాటాపూర్-తాడ్వాయి రహదారి మధ్యలో నీళ్ల ఒర్రెకు అర కిలోమీటర్ దూరంలో తునికాకు కోసేందుకు వెళ్లిన కూలీలకు సుజాత మృతదేహం కనిపించింది.
వారు వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఎస్సై శ్రీకాంత్రెడ్డి, పస్రా సీఐ శంకర్ ఘటనా స్థలాన్ని పరిశీలించి క్లూస్ టీమ్ను తీసుకువచ్చి మృతదేహాన్ని పరిశీలించారు. మృతురాలి మెడకు స్కార్ఫ్ చుట్టి ఉండటంతో పాటు తల వెనుక పెద్ద గాయమైంది. మృతురాలి కుమారుడు చరణ్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పంచనామా అనంతరం ములుగు ప్రభుత్వ దవాఖానకు మృతదేహాన్ని తరలించారు. మృతురాలి ఒంటిపై ఉన్న నాలుగు తులాల బంగారంతో పాటు సెల్ఫోన్ చోరీకి గురైనట్లు తెలిపారు. కాగా, కాటాపురంలో ఎవరి వాహనం ఎక్కి వెళ్లిందనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు.