బంట్వారం, జూన్ 9 : గ్రామ పంచాయతీల్లో నిర్వహిస్తున్న నర్సరీల్లో ఉన్న వంద శాతం మొక్కలను నాటేందుకు సిద్ధంగా ఉండాలని ఏపీవో సుధాకర్ అన్నారు. బుధవారం మండల పరిషత్ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటికే పలు నర్సరీల్లో టార్గెట్ కంటే తక్కువ మొక్కలు ఉన్నాయని, వాటి స్థానంలో మొక్కలను పెంచాలని పలు మార్లు చెప్పామని, కమ్యూనిటీ, అవెన్యూ లాంటి ప్లాంటేషన్లలో మొక్కలను పెంచాలన్నారు.
ఉపాధి కూలీల సంఖ్యను పెంచాలి..
గ్రామాల్లో కొనసాగుతున్న ఉపాధి హామీ పథకంలో పని చేసే కూలీల సంఖ్య పెంచాలన్నారు. అవసరమున్న రైతుల నుంచి హార్టికల్చర్లో మొక్కలు పెంచుకునేందుకు అర్జీలు తీసుకోవాలని సూచించారు. పంట నూర్పిడి కల్లాలు, పశువుల కొట్టాల నిర్మాణం కోసం ఆసక్తి ఉన్న రైతుల నుంచి దరఖాస్తు తీసుకోవాలని చెప్పారు.
ప్రతి రికార్డును నిర్వహించాలి
ప్రతి జీపీలలో ఉన్న రికార్డులను తప్పక నిర్వహించాలని ఇన్చార్జి ఎంపీవో పాండురంగంగౌడ్ అన్నారు. రికార్డు బుక్కులను ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలన్నారు. ఈ సమావేశంలో పంచాయతీ కార్యదర్శులు వెంకట్రెడ్డి, లక్ష్మి, గోపాల్, హారీఫ్, స్రవంతి పాల్గొన్నారు.