Congress Govt | హైదరాబాద్, ఏప్రిల్ 26 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో గత నాలుగు నెలలుగా ప్రభుత్వ ఆదాయం పెరిగినట్టు గణాంకాలు తెలుపుతున్నాయి. మరి ఈ ఆదాయం ఎక్కడికి పోతున్నది? ఎన్నికల వ్యయానికి నిధులను సమకూర్చేందుకు 20 శాతం కమీషన్తో పాత బిల్లులకు క్లియరెన్స్ ఇస్తున్నట్టు అధికార, రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత అప్పటివరకు వచ్చే నెలసరి ప్రభుత్వ ఆదాయం రూ.10వేల కోట్ల నుంచి రూ.11వేల కోట్ల వరకు పెరిగిందని ఆర్థికశాఖ లెక్కలు చెప్తున్నాయి. ఇలా గత నాలుగు నెలల్లోనే రూ.50వేల కోట్లపైగా ఆదాయం సమకూరింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన గత నాలుగు నెలల్లోనే ఏకంగా రూ.24వేల కోట్ల మేర అప్పులు తెచ్చింది. అంటే.. ప్రభుత్వానికి వచ్చే ఆదాయంతోపాటు అప్పులు కలుపుకుంటే దాదాపు రూ.75 వేల కోట్ల పద్దులు కండ్ల ముందు ఉన్నాయి. అంటే.. సర్కారు ఖజానాలో కాసులు బాగానే ఉన్నాయి. కానీ..?!
రైతుబంధు ఎందుకు వేయడం లేదు? ములుగు జిల్లా వెంకటాపురం మండలం కేశవాపూర్ గ్రామంలో శుక్రవారం మంత్రి సీతక్కను నిలదీసిన రైతులు. ఇక్కడే కాదు.. రాష్ట్రమంతా రైతుల్లో ఇదే ఆగ్రహం.
యాసంగి రైతుబంధు కోసం గతంలోనే ఖజానాలో రూ.7వేల కోట్ల పైచిలుకు మొత్తాన్ని ఉంచామని బీఆర్ఎస్ చెప్తున్నది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం ఐదెకరాల వరకు ఉన్న రైతులకు కూడా ఇప్పటివరకు పెట్టుబడి సాయం పూర్తిగా వేయలేదు.
రాష్ట్రంలో ఉద్యోగులు… ఉపాధ్యాయులకు సంబంధించిన జీతాల బకాయిలు, ఇన్సూరెన్స్, మెడికల్ రీయింబర్స్మెంట్ తదితరాలకు సంబంధించిన బిల్లులు నాలుగైదు నెలలుగా పెండింగులోనే ఉన్నాయి. ఎస్టీవో టోకెన్స్ వచ్చినప్పటికీ ఖజానా నుంచి బిల్లులు రాకపోవడంతో వారంతా చెప్పులరిగేలా తిరుగుతున్నారు.
రాష్ట్రంలో అంగన్వాడీ టీచర్లకు మూడు నెలలుగా జీతభత్యాలు, ఆశ వర్కర్లకు నాలుగు నెలలుగా టీఏ, డీఏలు రాలేదు. ఇలాంటి చిరుద్యోగులకు నెలల తరబడి జీతాలు పెండింగులో ఉండటంతో ఆ కుటుంబాలు ఆర్థిక కష్టాల్లో కూరుకుపోతున్నాయి. గురుకులాల్లో పని చేసే ఐసీటీ కంప్యూటర్ టీచర్లకు మూడు నెలలుగా జీతాలు రావడం లేదని ఇటీవల మాజీ మంత్రి హరీశ్రావు సైతం ఎక్స్ వేదికగా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారు.
పాత బిల్లులకు క్లియరెన్స్!
ఒకవైపు గత నాలుగు నెలల ఆర్థిక శాఖ లెక్కలేమో ప్రభుత్వ ఆదాయాన్ని ఘనంగానే చూపుతున్నా.. అన్నదాతకు రైతుబంధు ఇచ్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వానికి చేతులెందుకు రావడం లేదు? ఉద్యోగ, ఉపాధ్యాయవర్గాలను సైతం అరిగోస ఎందుకు పెడుతు న్నారు? ప్రభుత్వానికి సమకూరుతున్న ఆదాయం ఎక్కడికి పోతున్నది? ఆర్థిక శాఖలో అసలు ఏం జరుగుతున్నదని పెద్ద చర్చనీయాంశంగా మారింది. పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో తెలంగాణలోనూ బెంగళూరు తర హా కమీషన్ల దందా విశృంఖలంగా కొనసాగుతున్నదా? అన్న చర్చ సాగుతున్నది. అధికారిక, రాజకీయవర్గాల నుంచి అందుతున్న వి శ్వసనీయ సమాచారం మేరకు ఖజానా నుంచి నిధులు పక్కదారి పడుతున్నాయని, బ్యాక్డోర్లో పర్సంటేజీల పందేరంతో సర్కారు ఆదా యం పాత బిల్లుల క్లియరెన్స్కు మళ్లిపోతున్నదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ ఎన్నికల వ్యయానికి నిధులను సమీకరించడంలో నిమగ్నమైన పెద్దలు 20 శాతం కమీషన్తో పాత బిల్లులకు మోక్షం కలిగిస్తున్నట్టు అ ధికార, రాజకీయవర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇదే అదనుగా ఒక సన్నిహితుడు ‘స్వామి కార్యం… స్వకార్యం’ అన్నట్టు 10-11 శాతంతో పాత బిల్లులకు మోక్షం కలిగిస్తూ ‘సింహ’ భాగం దండుకుంటున్నారని చెప్పుకొంటున్నారు. పార్టీ ముఖ్యులంతా ఎన్నికల బిజీలో ఉన్న తరుణంలో సందట్లో సడేమియాగా సదరు వ్యక్తి ఉదయం లేచింది మొదలు పెండింగు బిల్లుల క్లియరెన్స్తోనే యమ బిజీగా ఉన్నట్టు సెక్రటేరియట్ అధికారికవర్గాల్లో చర్చ సాగుతున్నది.
చక్రం తిప్పుతున్న సన్నిహితుడు
కర్ణాటకలో గతంలోని బీజేపీ సర్కారుపై 40 శాతం కమీషన్ అంటూ ఆరోపణలు చేసి అధికారంలోకి వచ్చిన అక్కడి కాంగ్రెస్.. తెలంగాణ ఎన్నికల సమయంలో ఆ రాష్ట్రంలో అదే తరహా దందాను కొనసాగించినట్టు అప్పట్లోనే బయటపడింది. తెలంగాణలో ఎన్నికల వ్యయం కోసం కర్ణాటక కాంగ్రెస్.. బిల్డర్లు, కాంట్రాక్టర్ల నుంచి పెద్ద ఎత్తున వసూళ్లకు పాల్పడినట్టు ఆ రాష్ట్ర బీజేపీ నాయకులు బహిరంగంగా ఆరోపణలు చేశారు. అంతేకాదు.. బెంగళూరులో జరిగిన ఐటీ అధికారుల దా డుల్లో ఓ కార్పొరేటర్ ఇంట్లో భారీ ఎత్తున నగ దు కూడా బయటపడింది. పార్లమెంటు ఎన్నికల వ్యయాన్ని సమకూర్చుకునేందుకుగాను పె ద్దలు పెద్ద ఎత్తున పాత బిల్లుల క్లియరెన్స్కు తెరలేపినట్టు విశ్వసనీయంగా తెలిసింది. ముఖ్యుల ఆదేశంతోనే అధికారులు పాత దస్ర్తాలను దులిపి మరీ వాటికి మోక్షం కల్పిస్తున్నట్టు చర్చ సాగుతున్నది. ఒక్కోసారి పార్టీ ఫండ్గా ఏకంగా 20 శాతందాకా కమీషన్ సమర్పించాల్సి వస్తున్నదని కాంట్రాక్టర్లు గగ్గోలు పెడుతున్నారు. మరోవైపు కీలక నేతకు సన్నిహితుడైన ఒక వ్యక్తి ఆర్థిక శాఖలో చక్రం తిప్పుతున్నట్టు ప్రచారం జరుగుతున్నది. ఆయనకు 10-11 శాతం కమీషన్ సమర్పించుకుంటే గంటల వ్యవధిలోనే కోట్ల రూపాయల పెండింగు బిల్లులకు మోక్షం కలుగుతున్నట్టు కాంట్రాక్టర్లు చెప్పుకుంటున్నారు. అడిగినంత సమర్పించుకుంటే తప్ప తనకు సంబంధించిన 56 కోట్ల బిల్లులు క్లియర్ కాలేదని ఒక కాంట్రాక్టర్ వాపోయారు.
దిక్కుతోచని స్థితిలో సమర్పయామి
వాస్తవానికి ఇంత భారీ మొత్తంలో కమీషన్లు భారమే. నెలల తరబడి కోట్లా ది రూపాయల బిల్లులు పెండింగులో ఉండటంతో అప్పులు, బ్యాంకు రుణా లు తెచ్చి పనులు పూర్తిచేసిన కాంట్రాక్టర్లకు వడ్డీల భారం పెరిగిపోతున్నది. దీం తో కాంట్రాక్టర్లు 10-20 శాతం కమీషన్లకు సైతం ముందుకొస్తున్నారు. గతం లో భూములపై పెట్టుబడులు పెట్టగా రాష్ట్రంలో రియల్ రంగం కుదేలవడంతో బడా కాంట్రాక్టర్లు దిక్కుతోచని పరిస్థితు ల్లో పడిపోయారు. రియల్కు పూర్వ వైభవం వచ్చేదెప్పుడో.. అనే ఆందోళన తో అప్పులు ఇచ్చిన వాళ్ల ఒత్తిడి తట్టుకోలేక అలాంటి కాంట్రాక్టర్లు కమీషన్లు ఇచ్చేందుకు కూడా వెనుకాడటం లేదు. మరోవైపు పార్లమెంటు ఎన్నికల తర్వా త రాజకీయ పరిణామాలు ఎలా ఉం టాయనే దానిపై భిన్న అభిప్రాయాలు ఉ న్నాయి. రాజకీయ అనిశ్చితి నెలకొంటే పెండింగ్ బిల్లుల పరిస్థితి అటకెక్కే ప్రమాదముందని భయపడుతున్నారు. అందుకే కమీషన్ సమర్పించుకోవడ మో, పవర్ సెంటర్ను ప్రసన్నం చేసుకోవడమో చేస్తున్నారు.