కందుకూరు, ఆగస్టు 11: బీఆర్ఎస్ హయాంలో ఫార్మాసిటీ కోసం సేకరించిన భూములతో పాటు ఫ్యూచర్ సిటీకి మరిన్ని భూములు కావాలంటూ కాంగ్రెస్ ప్రభుత్వం క్రషర్ మెషీన్ల వారికి సంబంధించి భూములను లాక్కుంటూ వారి పొట్టకొడుతోంది. ఇన్నిరోజులుగా రైతుల భూములను ఇష్టారాజ్యంగా లాక్కుంటున్న రేవంత్ సర్కార్ కన్ను ఇప్పుడు ఫ్యూచర్ సిటీ సమీపంలో ఉన్న భూములపై పడింది.
దీంతో పోలీస్ పహారాల మధ్య టీజీఐఐసీ అధికారులు, జోనల్ కమిషనర్ క్రషర్లకు కేటాయించిన భూమిని స్వాధీనం చేసుకున్నారు. మండల పరిధిలోని మీర్ఖాన్పేట్ రెవెన్యూ పరిధిలో గల 112సర్వే నంబరులో 521 ఎకరాల భూమి ఉంది. ఈ భూమిలో 2022వ సంవత్సరంలో క్రషర్ మెషీన్లకు 20ఎకరాల భూమిని కేటాయించి మిగిలిన భూమిని ప్రభుత్వం సేకరించింది. తాజాగా క్రషర్ల కోసం కేటాయించిన 20 ఎకరాల భూములు తిరిగిచ్చేయాలని క్రషర్ల యాజమాన్యానికి ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది.
అయితే కేటాయింపునకు సంబంధించిన గడువు ఇంకా పూర్తికాకపోవడంతో.. భూములను ఇవ్వడానికి క్రషర్ మెషీన్ల యజమానులు అంగీకరించకపోవడంతో టీజీఐఐసీ అధికారులు మంగళవారం పోలీసులతో కలిసి.. క్రషర్ మెషీన్ల వద్దకు ఎవరినీ వెళ్ల్లకుండా కందకాలు తీసి బౌండ్రీ ఫిక్స్ చేసి ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. త్వరలో సంబంధిత భూమిని మరో కంపెనీకి కేటాయించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. ఇందతా కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే ప్రోద్భలంతో జరుగుతున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. క్రషర్ మెషీన్ల ద్వారా పదిమందికి ఉపాధి లభించేద.. 20ఎకరాల సేకరణకు ఇంత హంగామా చేయడం ఏంటని స్థానికులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.