JEE Advanced | హైదరాబాద్, ఏప్రిల్ 26 (నమస్తే తెలంగాణ) : ప్రతిష్ఠాత్మక ఐఐటీ ల్లో బీటెక్, ఆర్కిటెక్చర్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే జేఈఈ అడ్వాన్స్డ్ -2024కు దరఖాస్తు నమోదు శనివారం సాయంత్రం 5 గంటల నుంచి ప్రారంభంకానున్నది. ఈ ఏడాది జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షను ఐఐటీ మద్రాస్ నిర్వహించనున్నది. అభ్యర్థులు మే 7 సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తు చేసుకొనేందుకు గడువు ఉన్నది. ఫీజు మాత్రం మే 10 సాయంత్రం 5 గంటల వరకు చెల్లించొచ్చు. జేఈఈ మెయిన్ ర్యాంకులు గురువారం విడుదలైన విషయం తెలిసిందే. జేఈఈ మెయిన్కు హాజరైన వారిలో నుంచి 2. 5 లక్షల మంది జేఈఈ అడ్వాన్స్డ్కు అర్హత సాధించారు. క్యాటగిరీ వారీగా కటాఫ్ ర్యాంకులను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) విడుదల చేసింది. వీరంతా జేఈఈ అడ్వాన్స్డ్కు ప్రత్యేకంగా దరఖాస్తు చేయాల్సి ఉంటుంది.
రెండింటికీ హాజరుకావాల్సిందే..
జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షల్లో భాగంగా నిర్వహించే రెండు పరీక్షలకు విద్యార్థులు తప్పనిసరిగా హాజరుకావాలి. ఈ పరీక్షను మే 26న నిర్వహిస్తారు. రెండు పరీక్షలు రాసిన అభ్యర్థుల ఫలితాలను మాత్రమే ప్రకటిస్తారు. ఇదిలావుండగా, ఈ సారి జేఈఈ మెయిన్ సిలబస్ను కాస్త తగ్గించారు. కానీ, అడ్వాన్స్డ్లో మాత్రం యథాతథంగా పాత సిలబస్నే కొనసాగించారు. దీంతో అభ్యర్థులు ఆయా పాఠ్యాంశాలన్నీ చదవాల్సి ఉంటుంది.