హైదరాబాద్, ఆగస్టు 14 (నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రిగా ఉండి రేవంత్ క్షుద్ర పూజలంటూ మాట్లాడటం సిగ్గుచేటని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ మండిపడ్డారు. రేవంత్ కూడా క్షుద్రపూజలు చేసే సీఎం అయ్యారా? అంటూ ప్రశ్నించారు. తెలంగాణభవన్లో కార్పొరేషన్ మాజీ చైర్మన్ వై సతీశ్రెడ్డి, బీసీ కమిషన్ మాజీ మెంబర్ ఉపేంద్రతో కలిసి శుక్రవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సైన్స్ యుగంలో తాంత్రిక పూజలు, చేతబడుల గురించి మాట్లాడి సీఎం రేవంత్ తన చెత్తబుద్ధిని బయటపెట్టుకున్నారని మండిపడ్డారు.
పంద్రాగస్టు నుంచి కొత్తగా 2.25 లక్షల మందికి కొత్త పింఛన్లు ఇస్తామని ప్రభు త్వం ఊదరగొడుతున్నదని సంజయ్ మం డిపడ్డారు. కేసీఆర్ హయాంలో 45 లక్షల మందికి పింఛన్లు ఇచ్చారని గుర్తుచేశారు. కాంగ్రెస్ రెండున్నరేండ్ల పాలనలో 3.5 లక్షల పింఛన్లకు కోతపెట్టిందని ఆరోపించా రు. కానీ కొత్తవి ఇస్తున్నట్టు గొప్పలు చెప్పుకోవడం దుర్మార్గమని ధ్వజమెత్తారు. కేసీఆర్ పాలనలో బీడీ కార్మికులకు ఇచ్చిన పింఛన్లను రద్దు చేసేందుకు కుట్రలు చేస్తున్నదని విమర్శించారు.
కేసీఆర్ పాలనలో కల్యాణలక్ష్మి, షాదీముబారక్ లాంటి స్కీమ్లు తెచ్చి పేదల బతుకుల్లో వెలుగులు నింపారని సంజయ్ కొనియాడారు. కానీ రేవంత్ గద్దెనెక్కిన తర్వాత కేసీఆర్ పథకాలకు మంగళం పా డుతున్నారని మండిపడ్డారు. ఇదే కోవలో కేసీఆర్ కిట్ను తీసేశారని విమర్శించారు. ‘పెండ్లి చేసుకున్నప్పుడు ఇవ్వాల్సిన కల్యాణలక్ష్మి చెక్కులు పిల్లలు పుట్టిన తర్వాత వస్తున్నాయి..కల్యాణలక్ష్మి కాస్తా కాంగ్రెస్ పాలనలో సంతానలక్ష్మిగా మారింది..’ అంటూ వ్యాఖ్యానించారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తామని చెప్పడం తప్ప ఆచరణలో పట్టించుకోలేదని, కనీసం ప్రతినెలా రూ. 2500 హామీ అమల్లో కూడా విఫలమైందని ఎమ్మెల్యే సంజయ్ మండిపడ్డారు.