Somasila | మొక్కాల్సిన గుడులు, ఎక్కాల్సిన కొండలు, చూడాల్సిన నిర్మాణాలు, సేదతీరాల్సిన విడిది కేంద్రాలు, ఆస్వాదించాల్సిన రుచులు, అబ్బురపడాల్సిన ప్రకృతి చమత్కారాలు.. నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ పరిసరాల్లో అనేకం. అందులోనూ సోమశిల.. ఓ కలల కల్యాణమండపమే. చూసొద్దాం రండి.
నల్లమల పచ్చదనం, కృష్ణానది ప్రవాహం, ఆధ్యాత్మిక సౌరభం..ఇలా కొల్లాపూర్ ప్రత్యేకతలు కోకొల్లలు. తెలంగాణ రాష్ట్రం సిద్ధించాక సీఎం కేసీఆర్ నాయకత్వంలో సోమశిల పర్యాటకంగా ఎంతో అభివృద్ధి చెందింది. కృష్ణానదిపై ఐకానిక్ కేబుల్ బ్రిడ్జి పనులకు త్వరలో శ్రీకారం చుట్టనున్నారు. దీంతో సోమశిల టూరిజం జంక్షన్గా రూపుదిద్దుకోనున్నది. ఆవైపు సంగమేశ్వరాలయం, ఈవైపు సోమేశ్వరాలయం.. పుణ్యరాశిగా వెలిశాయి. ఇక్కడి ప్రకృతి అందాలు పాపికొండలకు దీటుగా నిలుస్తాయి. దీంతో పర్యాటకులు సోమశిలకు బారులుకడుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఉమ్మడి పాలమూరు జిల్లాలో పర్యాటకరంగ అభివృద్ధికి రూ.90 కోట్లు వెచ్చించింది. రూ. 20.86 కోట్లతో సోమశిలలో కాటేజీలు, లాంచీలు, హోటళ్లు ఏర్పాటుచేసింది. పర్యాటకశాఖ నేతృత్వంలో సోమశిల నుంచి శ్రీశైలం వరకు సాగే లాంచీ యాత్ర మరపురాని అనుభూతి. మార్గమధ్యలో ఆంకాళమ్మకోట, పక్కనే నది మధ్యలో వెలసిన ద్వీపంలో జాలర్ల నివాసాలు అబ్బురపరుస్తాయి. కాకపోతే ఆ వైభోగాన్ని నీళ్లు అడుగంటేలోపే చూడాలి. భారతదేశంలోనే తొలిసారిగా తెలంగాణలో సోమశిల-కొత్తపల్లి (నంద్యాల జిల్లా) మండలం సిద్ధేశ్వరం మధ్య రెండు కొండల నడుమ కృష్ణానదిపై 1.077 కిలోమీటర్ల ఐకాన్ కేబుల్ బ్రిడ్జి నిర్మించనున్నారు. ఇది కనుక పూర్తయితే.. ఈ ప్రాంతానికి మరింత పర్యాటక శోభ ఖాయం!
హైద్రాబాద్ నుంచి సోమశిల వరకు బస్సులో, ఇక్కడినుంచి శ్రీశైలం వరకూ లాంచీలో ప్రయాణం. శ్రీశైలంలో గదులు, రెండు పూటల భోజనం, తిరుగు లాంచీలో సోమశిలకు, అక్కడినుంచి గమ్యస్థానమైన హైద్రాబాద్కు.. ఈ ప్యాకేజీలో పెద్దలకు రూ.4,500 చార్జి చేస్తారు. ఒకవైపు యాత్రకూ అవకాశం ఉంటుందని తెలంగాణ ఏకో టూరిజం లాంచీ నిర్వాహకుడు రాజేష్గౌడ్ చెప్పారు. ప్రస్తుతం లాంచీ సోమశిల పరిసరాలకే పరిమితం. శ్రీశైలం ఆనకట్టకు వరద కొనసాగే సమయంలో మళ్లీ సోమశిల నుంచి మల్లన్న సన్నిధికి యాత్ర మొదలవుతుంది.
…? గునమోని నాగశేషయ్య