Yadagirigutta | యాదగిరిగుట్ట చుట్టూ అనేక ప్రాంతాలు ఆధ్యాత్మిక కేంద్రాలుగా విరాజిల్లుతున్నాయి. గత పాలకుల హయాంలో నిరాదరణకు గురైన పర్యాటక ప్రాంతాలు ఇప్పుడు గొప్పగా విరాజిల్లుతూ భక్తులను ఆకట్టుకుంటున్నాయి. యాదగిరిగుట్ట బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులు మరో రెండు, మూడ్రోజులు ఇక్కడే ఉండి వాటిని తిలకించి ఆహ్లాదం పొందవచ్చు. గుట్ట చుట్టూ ఉన్న కొలనుపాక, మత్స్యగిరి, రాజాపేట కోటతోపాటు తుర్కపల్లిలోని వెంకటాపురం నరసింహస్వామి దేవాలయాన్ని చూసి తరించవచ్చు.
ఆలేరు పట్టణానికి 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న కొలనుపాక ప్రాంతం శైవ, జైన ఆలయాలతో అలరారుతూ పర్యాటకులను ఆకట్టుకుంటున్నది. శతాబ్దాల చరిత్రకు సాక్ష్యంగా నిలిచే విగ్రహాలు, శాసనాలు ఇక్కడ ఎన్నో ఉన్నాయి. కొలనుపాక చుట్టూ 10 కిలోమీటర్ల పరిధిలో గత చరిత్రకు ఆనవాళ్లుగా నిలిచే విగ్రహాలు, శాసనాలు ఇప్పటికీ లభ్యమవుతున్నాయి. క్రీ.శ. 5-15 శతాబ్దాల కాలం నాటి శిల్పాలు, గజలక్ష్మి ధ్వజస్తంభం, చాముండి, నటరాజ, బైరవుడు, నాగశిల్పం, సప్త మాతృకలు, వీరభద్రుడు, భద్రకాళి, ఆరో విక్రమాదిత్యుడి శాసనాలు, 1085 నాటి తొండర చోళ్ల రాజు శాసనాలు ఇప్పటికీ దర్శనమిస్తాయి. చండీ సమేత సోమేశ్వరస్వామి ఆలయం, కళ్యాణి చాళుక్యులు, కాకతీయ రాజుల కాలంలో సోమేశ్వర, వీరనారాయణ స్వామి ఆలయాలను నిర్మించారు. ఈ ఆలయంలో స్వయంభువుగా వెలిసిన శివలింగం ప్రసిద్ధి గాంచింది. శివరాత్రికి ఈ ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు. కొలనుపాక జైనులకు తీర్థయాత్ర స్థలంగా కోబలి తీర్థ శాసనం చెబుతుంది. ఏటా ఇక్కడ జరిగే మహావీరుడి జయంతి, రథోత్సవానికి దేశ, విదేశాల నుంచి జైనులు తరలి వస్తారు. ఇంతటి అద్భుతమైన కొలనుపాక అస్తిత్వాన్ని కాపాడేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ రూ.1.79 కోట్లు మంజూరు చేయగా.. వైటీడీఏ ఆధ్వర్యంలో అభివృద్ధి పనులు చేపడుతున్నారు. కొలనుపాకకు యాదగిరిగుట్ట నుంచి 22 కిలోమీటర్ల దూరం ఉంటుంది. యాదగిరిగుట్ట నుంచి సైదాపురం, మాసాయిపేట, కాచారం, ధర్మారెడ్డిగూడెం నుంచి కొలనుపాకకు చేరుకోవచ్చు. దీంతోపాటు వంగపల్లి ఎన్హెచ్ 163 నుంచి ఆలేరు పట్టణం మీదుగా వెళ్లొచ్చు.
యాదాద్రి భువనగిరి జిల్లాలోని వలిగొండ మండలం వెంకటాపురంలో గల మత్స్యగిరి లక్ష్మీనరసింహస్వామి దేవాలయం అత్యంత మహిమాన్వితమైనదిగా విరాజిల్లుతున్నది. కోరిన కోర్కెలు తీర్చుతూ కొంగుబంగారు స్వామిగా నిలుస్తున్నారు. పురాణాల ప్రకారం పూర్వకాలంలో ప్రస్తు త మత్స్యగిరి ప్రాంతంలో సూరుకొండ, మాలకొండ, వేములకొండ అనే కొండలు, దట్టమైన అటవీ ప్రాంతాలు ఉండేవి. మునీశ్వరుల ఘోర తపస్సుకు మెచ్చి మహావిష్ణువు శంకు, చక్ర, తిరునామాలతో స్వయంభువుగా వెలిశారు. మత్స్యగిరి కొండపైన ఇప్పటికీ తరగని జల సిరితో కోనేరు ఉంది. ఇందులోని చేపల తలపై విష్ణునామాలు ఉండటం ఇక్కడి ప్రత్యేకత. ఈ కోనేరులో మూడు మునకలు మునిగితే మూడు జన్మల పాపాలు తొలుగుతాయని భక్తుల విశ్వాసం. ఇప్పటికీ కోనేరులో చేపలను విష్ణు స్వరూపాలుగా భక్తులు విశ్వసిస్తూ బియ్యం, నూకలు సమర్పిస్తారు. కోనేరులోని నీటిని తీసుకెళ్లి వ్యవసాయ క్షేత్రాల్లో, పశువుల దొడ్లల్లో చిలుకరిస్తే పంటలు, పశుసంపద వృద్ధి చెందుతుందని భక్తుల నమ్మకం. మత్స్యాద్రికి యాదగిరిగుట్ట నుంచి 45 కిలోమీటర్ల దూరం ఉంటుంది. యాదగిరిగుట్ట నుంచి రెండు మార్గాల గుండా అక్కడికి వెళ్లవచ్చు. దీంతోపాటు నాగిరెడ్డిపల్లి గ్రామం, వలిగొండ మండల కేంద్రం నుంచి చేరుకోవచ్చు.
యాదగిరిగుట్టకు 10కిలోమీటర్ల దూరంలో తుర్కపల్లి మండలంలోని వెంకటాపురంలోని వెంకటగిరి లక్ష్మీనరసింహుడి క్షేత్రం కొలిచిన భక్తులకు కొంగు బంగారంగా నిలుస్తున్నది. వెంకటగిరి కొండపైన యోగానంద లక్ష్మీనరసింహుడిగా వెలిశారు. అనారోగ్యం, భూత, పేత, పిశాచాలతో బాధపడుతున్న వారు ఇక్కడ 40 రోజులు దీక్ష చేపట్టి కొండపైన ఉన్న కొలనులో నీటిని సేవిస్తే నశిస్తాయని భక్తుల విశ్వాసం. ఇక్కడ ఓంకారం ఆకారంలో ఉన్న మర్రిచెట్టు భక్తులను ఆకట్టుకుంటున్నది. ఇక్కడ ప్రతి ఏడాది ఏప్రిల్లో స్వామివారి తిరుకల్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహిస్తారు.
పురాతన కోటల్లో రాజాపేట కోట ఒకటి. ఈ కోటలో శిల్ప కళ అబ్బుర పరుస్తున్నది. అడుగడుగునా కనిపించే సంస్థానాధీశుల స్మృతి చిహ్నాలు ఈ ప్రాంత ఔన్నత్యాన్ని చాటుతున్నాయి. ప్రధాన దుర్గంలో ప్రతి గడి ఎంతో సుందరంగా ఉంటుంది. దర్వాజలు, బాల్కానీలు, బురుజుల నిర్మాణ రీతి అపురూపం. అద్దాల మేడ భవనం పైకి ఎక్కేందుకు చార్మినార్ మాదిరిగా మెట్లు నిర్మించారు. యాదగిరిగుట్టకు 20 కిలోమీటర్ల దూరంలోని రాజాపేట కోటను 1775లో రాజరాయన్న రాజు కోటను నిర్మించి.. రాజాపేట గ్రామాన్ని ఏర్పాటు చేశారు. శత్రు దుర్భేద్యమైన రాతి గోడను కట్టించారు. శత్రువుల దాడిని తిప్పికొట్టేందుకు కోట లోపలి నుంచి సొరంగ మార్గాలు తవ్వించారు. కోట లోపల అతి సుందర భవనాలు, రాణుల అంతఃపురాలు, స్నానవాటికలు ఉన్నాయి. శత్రు సైన్యం రాకుండా కోట గోడల ముందు పెద్ద కందకం తవ్వించి ఎగువ పడమటి వైపు గోపాల చెర్వు నుంచి కందకంలోకి నీరు పారించారు. అందులో మొసళ్లను పెంచేవారు. కోట ముఖ ద్వారానికి పెద్ద తలుపులు అమర్చారు. మొదటి ముఖ ద్వారం నుంచి మూడో ముఖ ద్వారం వరకు సుదీర్ఘమైన రాచమార్గం ఉంది. రాజు నివాసం, అంతఃపురం, అద్దాల మేడ, అతిథి గృహం, స్నానవాటిక, గిరిగిరి మాల్, ఎత్తైన బురుజులు, కారాగారం, కొలను, సైనికుల శిక్షణ స్థలం ఇప్పటికీ కన్పిస్తాయి. యాదగిరిగుట్ట నుంచి సైదాపురం, మాసాయిపేట, గౌరాయిపల్లి గుండా రాజాపేటకు చేరుకోవచ్చు.