India | టీమిండియా మాజీ వైస్ కెప్టెన్ అజింక్య రహానే అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలకడంతో భారత క్రికెట్లో కొత్త చర్చ మొదలైంది. గత కొన్నేళ్లుగా జాతీయ జట్టుకు దూరంగా ఉన్న రహానే, ఇకపై అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించడం అభిమానులను ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ నిర్ణయం తర్వాత జట్టుకు దూరంగా ఉన్న మరికొందరు సీనియర్ ఆటగాళ్లు కూడా త్వరలోనే రిటైర్మెంట్ ప్రకటించే అవకాశాలపై ఊహాగానాలు జోరందుకున్నాయి. ఒకప్పుడు భారత టెస్ట్ జట్టుకు కీలక బ్యాటర్గా, వైస్ కెప్టెన్గా సేవలందించిన అజింక్య రహానే గత మూడేళ్లుగా జాతీయ జట్టులో స్థానం దక్కించుకోలేకపోయాడు. దేశవాళీ క్రికెట్లో నిలకడగా రాణించినప్పటికీ సెలెక్టర్లు అవకాశాలు ఇవ్వకపోవడంతో చివరికి అంతర్జాతీయ కెరీర్కు ముగింపు పలకాలని నిర్ణయించుకున్నాడు.
రహానే నిష్క్రమణతో భారత క్రికెట్లో ఒక ముఖ్యమైన అధ్యాయం ముగిసిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు టీమిండియా స్వింగ్ స్పెషలిస్ట్ భువనేశ్వర్ కుమార్ ఇప్పటికీ దేశవాళీ క్రికెట్, ఐపీఎల్లో మంచి ప్రదర్శనలు చేస్తూనే ఉన్నాడు. ఇటీవల జరిగిన సీజన్లోనూ కీలక వికెట్లు తీసి తన అనుభవాన్ని మరోసారి నిరూపించాడు. అయినప్పటికీ భారత జట్టులో అవకాశాలు లేకపోవడంతో అతని భవిష్యత్తుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే భువీ కూడా అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది.సుదీర్ఘకాలం భారత పేస్ దళానికి నాయకత్వం వహించిన ఇషాంత్ శర్మ కూడా జాతీయ జట్టుకు చాలా కాలంగా దూరంగా ఉన్నాడు. చివరిసారిగా భారత్ తరఫున మరో మ్యాచ్ ఆడి గౌరవప్రదంగా రిటైర్మెంట్ ప్రకటించాలని భావిస్తున్నప్పటికీ, ప్రస్తుత పరిస్థితుల్లో ఆ అవకాశం దక్కే సూచనలు కనిపించడం లేదు. దీంతో ఆయన కూడా త్వరలోనే అధికారికంగా వీడ్కోలు ప్రకటించే అవకాశాలు ఉన్నాయని క్రీడా వర్గాలు భావిస్తున్నాయి.
టెస్ట్ క్రికెట్లో భారత్ తరఫున త్రిబుల్ సెంచరీ సాధించిన అరుదైన బ్యాటర్లలో ఒకడైన కరుణ్ నాయర్కు కూడా జట్టులో అవకాశం దక్కడం లేదు. చాలా కాలం తర్వాత జట్టులోకి వచ్చినా వచ్చిన అవకాశాలను పూర్తిగా వినియోగించుకోలేకపోవడంతో మళ్లీ జట్టుకు దూరమయ్యాడు. ప్రస్తుతం అతని రీఎంట్రీ అవకాశాలు కూడా చాలా స్వల్పంగానే కనిపిస్తున్నాయి. మరోవైపు ఆల్రౌండర్ శార్దుల్ ఠాకూర్ కూడా యువ ఆటగాళ్ల రాకతో తీవ్ర పోటీని ఎదుర్కొంటున్నాడు. కొత్త తరానికి ప్రాధాన్యం పెరగడంతో అతని అవకాశాలు తగ్గిపోయాయి. ఈ పరిస్థితుల్లో శార్దుల్ కూడా తన భవిష్యత్తుపై త్వరలోనే నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని సమాచారం. భారత స్టార్ ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ షమీ కూడా జాతీయ జట్టుకు దూరంగా ఉన్నాడు. దేశవాళీ క్రికెట్లో రాణిస్తున్నప్పటికీ అతడికి అవకాశాలు రాకపోవడంతో అభిమానుల్లోనూ చర్చ మొదలైంది. రహానే రిటైర్మెంట్ అనంతరం భువనేశ్వర్ కుమార్, ఇషాంత్ శర్మ, కరుణ్ నాయర్, శార్దుల్ ఠాకూర్, మహమ్మద్ షమీ భవిష్యత్తుపై ప్రచారం జోరుగా సాగుతున్నప్పటికీ, వీరిలో ఎవరూ ఇప్పటివరకు అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు ప్రకటించలేదు. రానున్న రోజులలో ఏం జరగనుందో చూడాల్సి ఉంది.